చెత్తతో విద్యుత్.. నేడు ప్లాంట్‌ ప్రారంభానికి కేటీఆర్ 

by Vadlamudi Anukaran |

<p>దిశ ప్రతినిధి, మేడ్చల్ : పదేళ్ల కల సాకారం కానుంది. చెత్తతో విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చేసిన సుధీర్ఘ ప్రయత్నాలు ఫలించనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నుంచి వెలువడే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసింది. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్‌ రాష్ట్రాల్లో ఉండగా.. దక్షిణ భారతదేశంలో మాత్రం తెలంగాణలో మొదటి ప్లాంట్‌ మంగళవారం అందుబాటులోకి రానున్నది. [&hellip;]</p>

చెత్తతో విద్యుత్.. నేడు ప్లాంట్‌ ప్రారంభానికి కేటీఆర్ 
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : పదేళ్ల కల సాకారం కానుంది. చెత్తతో విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చేసిన సుధీర్ఘ ప్రయత్నాలు ఫలించనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నుంచి వెలువడే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసింది. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్‌ రాష్ట్రాల్లో ఉండగా.. దక్షిణ భారతదేశంలో మాత్రం తెలంగాణలో మొదటి ప్లాంట్‌ మంగళవారం అందుబాటులోకి రానున్నది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు.

దక్షిణాదిలోనే తొలిప్లాంట్…

గ్రేటర్‌లో నిత్యం సగటున 6,300 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. ఈ చెత్తను జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. వ్యర్ధాల డంపింగ్‌ వల్ల దుర్వాసన వస్తోందన్న పౌరుల అభ్యంతరాల నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణకు శ్రీకారం చుట్టాలని 2009లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెత్తను వేరు చేసి తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు, శుద్ధి చేసిన చెత్తతో విద్యుదుత్పత్తి చేయొచ్చని భావించింది.

విద్యుత్ ఉత్పత్తికోసం పలు సంస్థలు చేపట్టిన పనులు ముందుకు సాగలేదు. ఈ మేరకు జీహెచ్ఎంసీతో 25ఏళ్ల కాలానికి రాంకీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు చెత్తను వినియోగించి 19.8మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని, దీన్ని ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ (ఐఎంఎస్ డబ్ల్యూఎం) ప్రాజెక్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఎట్టకేలకు ప్లాంట్ ను పూర్తి చేసిన రాంకీ సంస్థ డంపింగ్ కేంద్రంలో రెండు నెలలుగా వేస్టేజ్ నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. దీంతో దక్షిణ భారత్ లోనే చెత్త నుంచి విద్యత్ ఉత్పత్తి చేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ నిలిచింది.

పర్యావరణహిత ప్రాజెక్ట్..

గ్రేటర్ లో చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు రాంకీ జవహర్ నగర్ లో పర్యావరణహితమైన థర్మల్ కంబషన్ టెక్నాలజీతో విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను నిర్మించింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ఏళ్ల తరబడి గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా నిర్వహించే చర్యలతో ఇప్పటి వరకు 75,19,278 మెట్రిక్ టన్నుల చెత్తను లెక్కించారు. దాదాపు 125ఎకరాల్లోని చెత్త గుట్టలకు రూ.144కోట్లతో క్యాపింగ్ పనులు చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తికి ఉపకరించేలా శుద్ధి చేయగా మండే గుణమున్న చెత్తను రెప్యూజ్ డిరైవ్ ప్యూయెల్ (ఆర్ డీఎఫ్)గా వ్యవహరిస్తారు.

ఈ టెక్నాలజీతో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లు ఢీల్లీలో-3, అహ్మదాబాద్ జబల్ పూర్ లో ఒకటి ఉన్నాయి. ఢిల్లీలోని 3 ప్లాంట్లను కూడా రాంకీయే నిర్వహిస్తూ.. వాటి ద్వారా 59 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి తొలి దశలో 19.8మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయనుండగా, ఇందుకు రోజుకు 1000నుంచి 1200మెట్రిక్ టన్నుల ఆర్డీఎఫ్ చెత్తను ఉపయోగించనున్నారు. రెండో దశలో మరో 28.2మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్లాంట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పరిశీలించారు. ప్లాంట్ ప్రారంభోత్స ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

Next Story