నేడు భారత్ బంద్

by  |
నేడు భారత్ బంద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంయుక్త కిసాన్ మంచ్ ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ సహా 19 పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మూడు సాగు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సరిగ్గా సంవత్సరం పూర్తయిన సందర్భంగా పలు రైతాంగ సంఘాలు ఒక్కటై ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేసే ఉద్దేశంతో భారత్ బంద్ నిర్ణయం తీసుకున్నాయి. మోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తూ మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని గతేడాది నుంచి డిమాండ్ చేస్తున్నాయి. భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు పలికిన కాంగ్రెస్ సహా 19 విపక్ష పార్టీలు ఇప్పటికే సమావేశమై ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఈ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చింది. జాతీయ రహదారులను దిగ్బంధం చేసే కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు స్వచ్ఛంధంగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కూడా తీర్మానం ఏకగ్రీవ ఆమోదం పొందింది. ఇప్పుడు ఇదే చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, పార్టీలు ఇస్తున్న భారత్ బంద్ పిలుపు విషయంలో మాత్రం ఎలాంటి వైఖరీ వెల్లడించకుండా మౌనంగా ఉండిపోయింది టీఆర్ఎస్.

మరోవైపు పలు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సహా మావోయిస్టు పార్టీ కూడా భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయి. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కూడా భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ వర్తక వాణిజ్య సంఘాలు మాత్రం జాతీయ స్థాయిలో బంద్‌లో పాల్గొనేది లేదని, తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించినా తెలంగాణ విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆర్టీసీ బస్సు సర్వీసులు, మెట్రో రైల్ సర్వీసులు యథావిధిగానే నడవనున్నాయి. క్యాబ్ సర్వీసులతో పాటు ప్రైవేటు వాహనాల రాకపోకలు కూడా యథావిధిగానే నడవనున్నాయి.

తెలంగాణలో బంద్‌ను సంపూర్ణంగా విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష, వామపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. బీజేపీ ఎలాగూ దూరంగా ఉంటున్నది. రాష్ట్రంలో అధికార పార్టీకి మద్దతుగా ఉండే కొన్ని విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉప్పల్‌ బస్సు డిపో దగ్గర ఆందోళనలో పాల్గొంటున్నారు. అన్ని జిల్లాల్లోని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి, సీపీఐ ఎంఎల్, లిబరేషన్, ఫార్వర్డ్ బ్లాక్, న్యూ డెమొక్రసీ తదితర పలు పార్టీలు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొంటున్నాయి. అన్ని సెక్షన్ల ప్రజలు రైతాంగానికి అండగా ఉండాలని, బంద్‌కు సహకరించాలని ఈ పార్టీలు విజ్ఞప్తి చేశాయి.

కాంగ్రెస్ నేతృత్వంలో గత నాలుగైదు రోజులుగా వరుస సమావేశాలు ఏర్పాటుచేసుకున్న రాష్ట్రంలోని విపక్ష పార్టీలు ఎక్కడెక్కడ ఎలాంటి ఆందోళనలో పాల్గొనాలో, ఏ పార్టీకి చెందిన నేత ఎక్కడ నేతృత్వం వహించాలో షెడ్యూలు ఖరారైంది. రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం, ప్రజల కోసం చేస్తున్న బంద్ అని ఆ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు కొనసాగింపుగా ఈ నెల 30వ తేదీన అన్ని జిల్లాల్లో కలెక్టరేట్‌లను ముట్టడించి వినతిపత్రాలను ఇచ్చే కార్యక్రమం కూడా ఖరారైంది. విపక్షాలన్నీ ఒక్కటై పాల్గొంటున్న ఈ నిరసన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయో, పోలీసులు ఏ రకమైన ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో భారత్ బంద్ లో భాగంగా విపక్ష పార్టీలు, విద్యార్థి యువజన సంఘాల కార్యకర్తలు గన్ పార్కు దగ్గరకు వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు. భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది

Next Story

Most Viewed