ఆటోలకు మూడు లీటర్ల ఫ్యూయల్ ఫ్రీ

by  |
Fuel price hike
X

దిశ, ఫీచర్స్ : దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రూ.100కు అటు ఇటుగా దోబూచులాడిన పెట్రోల్ ధర ఎట్టకేలకు ఆ మార్క్‌ను క్రాస్ చేసేసింది. మరోవైపు పాండమిక్‌ కారణంగా ప్రయాణాలు తగ్గిపోగా, అందరూ సొంత వాహనాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటోరిక్షాలు, క్యాబ్‌ డ్రైవర్లు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుండగా.. రోజురోజుకూ పెరుగుతున్న ఫ్యూయల్ ధరలు వారిని కోలుకోలేకుండా చేస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్‌లో కేరళలోని ఓ మూరుమూల గ్రామానికి చెందిన ఫ్యూయల్ స్టేషన్.. ఆటోరిక్షా డ్రైవర్లకు ఉచితంగా మూడు లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇవ్వడం విశేషం.

కాసర్‌గోడ్‌ జిల్లా, ఎన్మకాజె గ్రామపంచాయతీ పరిధిలోని కుడుకోలి ఫిల్లింగ్ స్టేషన్‌లో సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి రెండు రోజుల పాటు 3 లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను ఫ్రీగా అందజేశారు. ఈ మేరకు బంక్ మూసే సమయానికి మొత్తం 313 ఆటోరిక్షా డ్రైవర్లు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకున్నట్టు ఫ్యూయల్ స్టేషన్ మేనేజర్ సిద్దిక్ మదుమోల్ వెల్లడించారు. ఈ ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్‌కు ఆయన బ్రదర్ అబ్దుల్లా మదుమోల్ ఓనర్ కాగా, అబుదాబిలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇక స్టేట్ హైవే 64పై, కర్ణాటకలోని శారద్కా నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బంక్‌కు మామూలుగా అయితే కనీసం 300 కస్టమర్లు కూడా వచ్చేవారు కాదని సిద్దిక్ తెలిపాడు. ఇక ఆఫర్ అమలు చేసిన రోజుల్లో లీటరు పెట్రోల్ రేటు రూ.97.70, డీజిల్‌కు రూ.93.11 ఉండగా.. మొత్తంగా లక్ష రూపాయల విలువైన ఫ్యూయల్‌ను ఫ్రీగా ఇచ్చామని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ సిచ్యువేషన్‌లో ఆటోరిక్షా డ్రైవర్లకు హెల్ప్ చేసేందుకే ఈ పని చేసినట్టు తెలిపిన సిద్దిక్.. బిజినెస్ ప్రమోషన్ కోసం కాదని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు 15 కిలోమీటర్ల దూరం నుండి కూడా వచ్చినట్టు పేర్కొన్నారు.

ఉచితంగా 3 లీటర్ల ఫ్యూయల్ పొందిన ఆటోరిక్షా డ్రైవర్లలో కొందరు తమ ఇన్నేళ్ల సర్వీసులో ఎవరు కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించలేదని చెబుతున్నారు. ప్రస్తుతం రూ.500 ఫ్యూయల్ నింపుకుంటే మూడు రోజుల్లో రూ.1000 మాత్రమే ఎర్న్ చేస్తున్నానని, రెండు సంవత్సరాల క్రితం ఇంతే ఫ్యూయల్‌తో రూ. 1500 సంపాదించేవాడినని ఓ ఆటోడ్రైవర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు కొత్త ఆటోరిక్షాలకు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా 6000 నుంచి 9000కు పెరిగిందని తమ కష్టాలను వివరించాడు.

Next Story

Most Viewed