టైటాన్ కంపెనీ ఆదాయం 38 శాతం క్షీణత

by  |
టైటాన్ కంపెనీ ఆదాయం 38 శాతం క్షీణత
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్ యాజమాన్యంలోని టైటాన్ (Titan) సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండో త్రైమాసికంలో ఆదాయం 1.72 శాతం క్షీణించి రూ. 4,389 కోట్లకు చేరుకుంది. గడియారాలు, ఆభరణాలు, కళ్లజోడు విభాగాల్లో రికవరీ కారణంగా ఆదాయం మెరుగ్గా ఉందని కంపెనీ అభిప్రాయపడింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 37.81 శాతం క్షీణించి రూ. 199 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 320 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రికవరీ కారణంగా భవిష్యత్తుపై ఆశలు మెరుగ్గా ఉన్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేయడంతో సంస్థ దాదాపు అన్ని స్టోర్లను నిర్వహిస్తోందని కంపెనీ పేర్కొంది.

‘ రెండో త్రైమాసికంలో కంపెనీ సాధించిన రికవరీ చాలా సంతృప్తికరంగా ఉంది. అదేవిధంగా ఈ ఏడాది పండుగ సీజన్ ముగిసేలోపు అన్ని విభాగాలు ఇదే స్థాయి రికవరీ సాధించే అవకాశాలున్నాయని భావిస్తున్నట్టు’ టైటాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సి కె వెంకటరమణ అన్నారు. కొత్త ఆవిష్కరణలతో ప్రధాన వ్యాపారాల్లో మార్కెట్ వాటా స్థిరంగా కొనసాగుతోంది. ఖర్చులు, మూలధనంపై కంపెనీ దృష్టి సారించిందని, ఈ చర్యలు ద్రవ్య నిర్వహణకు సహాయపడతాయని ఆయన చెప్పారు. ఆభరణాల విభాగం ఇతర విభాగాల కంటే మెరుగ్గా రూ. 3,837 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గడియారాల విభాగం 44 శాతం క్షీణతతో రూ. 400 కోట్ల అమ్మకాలను నిర్వహించినట్టు, కళ్లజోడు విభాగం 39 శాతం క్షీణతతో రూ. 94 కోట్ల అమ్మకాలను నిర్వహించిందని కంపెనీ తెలిపింది.



Next Story