కరోనా విజృంభణ.. కంటైన్‌మెంట్‌ జోన్‌గా తిరుపతి

by  |
Tirupati
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా తిరుపతి నగరంలో వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి మొత్తాన్ని కంటైన్మెంట్‌ జోన్‌‌గా ప్రకటిస్తున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా ప్రకటించారు. ఈ మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వ్యాపార సంఘాలు, ఆటో, జీపు డ్రైవర్ల యూనియన్లతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, నగరపాలక కమిషనర్‌ గిరీషా, ఎస్పీ వెంకటప్పలనాయుడు సమావేశమయ్యారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా మాల్స్‌, దుకాణాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించాలని ఆదేశించారు.

రేపటి(మంగళవారం) నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచేలా తాము నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు అధికారులకు తెలిపాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ.. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవాలని కోరారు. వైరస్‌ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక కమిషనర్‌ ప్రకటించారు. ఓ వైపు కేసుల నియంత్రణ.. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.



Next Story

Most Viewed