శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రేపే అంకురార్పణ

by  |
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రేపే అంకురార్పణ
X

దిశ, ఏపీ బ్యూరో: ఈనెల 16 నుంచి 24వరకు జరిగే తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేర‌కు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల త‌ర‌హాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహించాల‌ని టీటీడీ నిర్ణయించింది. గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ నిర్వహిస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైంది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ.

కల్యాణ మండపంలో వాహ‌న‌ సేవ‌లు…

శ్రీవారి ఆల‌యంలోని కల్యాణ మండ‌పంలో ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వహిస్తారు. తొలిరోజు 16న ఉద‌యం 9నుంచి 11 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7నుంచి 8 గంట‌ల వ‌ర‌కు పెద్దశేష వాహ‌న‌సేవ జ‌రుగుతాయి. 20న రాత్రి 7 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు గ‌రుడ‌సేవ జ‌రుగుతుంది. 21న మ‌ధ్యాహ్నం 2 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు వ‌సంతోత్సవ ఆస్థానం, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కల్యాణ మండ‌పంలో పుష్పక విమానంపై స్వామి, అమ్మవార్లు ద‌ర్శన‌మిస్తారు. 23న ఉద‌యం 8 గంట‌ల‌కు సువర్ణ ర‌థం బ‌దులుగా సర్వభూపాల వాహ‌న‌సేవ ఉంటుంది. 24న ఉద‌యం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని అద్దాల మండపంలో స్నప‌న‌తిరుమంజ‌నం, చక్రస్నానం నిర్వహిస్తారు. 25న విజయదశమి పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరుగుతుంది.



Next Story

Most Viewed