సరస్వతీ అలంకారంలో సిరుల‌త‌ల్లి

by  |
సరస్వతీ అలంకారంలో సిరుల‌త‌ల్లి
X

దిశ, ఏపీ బ్యూరో : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. వాహ‌న మండ‌పంలో అమ్మవారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను పరమహంసలుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలుగుతారు.

అట్టి మహాయోగి పుంగవుల హృదయాల్లో జ్ఞానస్వరూపిణియైన అలివేలు మంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ అని ఆ తల్లిని ఆరాధిస్తారు. వాహనసేవలో పెద్దజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ కేఎస్​జవహర్ రెడ్డి, జేఈవో పీ బ‌సంత్‌ కుమార్‌, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, వీఎస్‌వో బాలిరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ మల్లీశ్వరి, ఏవీఎస్వో చిరంజీవి పాల్గొన్నారు.


Next Story

Most Viewed