దేవుడికి దండం పెట్టి దొంగతనం

by  |
దేవుడికి దండం పెట్టి దొంగతనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులు తీవ్ర ప్రకంపనలను రేపుతున్నాయి. ముఖ్యంగా అంతర్వేది, పిఠాపురం, బెజవాడ కనకదుర్గ ఆలయాల్లో జరిగిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హిందువుల మనోభావాల పై దాడులు జరుగుతున్నాయని బీజేపీ, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇలా తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఆంజనేయస్వామి ఆలయంలోని హుండీ బద్ధలు కొట్టి చోరీ చేసిన కలకలం రేపుతోంది.

మండపేట మండల పరిధిలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఈ దొంగతనం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ బైక్‌ పై విగ్రహం వద్దకు వచ్చిన దుండగులు ముందుగా స్వామి వారి కాళ్లు మొక్కారు. భక్తితో మొక్కారో భయంతో మొక్కారో గానీ.. విగ్రహం ఎదుటే ఉన్న హుండీని కొల్లగొట్టారు. హుండీలో ఉన్న డబ్బంతా దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారీ అయ్యారు. సోమవారం ఉదయం విగ్రహం వద్ద హుండీ లేకపోవడం చూసిన పూజారి, భక్తులు స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ పరిశీలించిన పోలీసులు.. దేవుడికి దండం పెట్టి మరీ దొంగతనం చేశారని షాక్‌ అయ్యారు.


Next Story

Most Viewed