శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం

by  |
శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. జాదిబాల్ ఏరియాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హతమైనట్టు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. మే 20న ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను చంపిన ఘటనలో ఈ ఇద్దరు ఉగ్రవాదుల హస్తమున్నదని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. జాదిబాల్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ముందస్తు సమాచారంతో సీఆర్‌పీఎఫ్, ఆర్మీ సంయుక్తంగా ఆ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాదులున్న ప్రాంతానికి చేరగానే వారు ఒక ఇంటిలోకి చొరబడి భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వివరించారు. ఆదివారం ఉదయమే షోపియన్ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌‌లో ఒక ఉగ్రవాది చనిపోయినట్టు ఆర్మీ నార్తర్న్ కమాండ్ తెలిపారు. శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ తర్వాత ఇంటర్నె్ట్ సేవలను నిలిపేసినట్టు అధికారులు వివరించారు.

Next Story