ఎమ్మెల్సీ పదవికి ‘త్రిముఖ పోటీ’

by  |
ఎమ్మెల్సీ పదవికి ‘త్రిముఖ పోటీ’
X

దిశ, నిజామాబాద్:
నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుని ఎన్నిక కోసం జరిగే ఉప పోరులో త్రిముఖ పోరు ఖాయమైంది. గురువారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో బుధవారమే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయగా గురువారం కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12నే ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైనా.. నిజామాబాద్ నుంచి ఆశావహులు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడింది.

నిజామాబాద్ స్థానిక సంస్థల్లో స్పష్టమైన మెజార్టీ ఉన్న అధికార పార్టీ తన అభ్యర్థిని ప్రకటించే వరకు బీజేపీ, కాంగ్రెస్‌లు తాము పోటీ చేసే విషయంతోపాటు అభ్యర్థులెవరనే విషయాన్ని ప్రకటించనే లేదు. మంగళవారం అధికార పార్టీ తరఫున మాచారెడ్డికి చెందిన లోయలపల్లి నర్సింగ్ రావు తన నామినేషన్ దాఖలు చేశారు. ఐతే రాత్రికి రాత్రే సీఎం కేసీఆర్.. తన కుమార్తె, మాజీ ఎంపీ కవితను అధికార పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం బీజేపీ తరఫున మాజీ ఉద్యోగ సంఘం నేత, బీజేపీ నాయకులు పోతన్‌కర్ లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. తరువాత మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన కల్వకుంట్ల కవిత అధికార పార్టీ తరపున తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అయితే, నిజామాబాద్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తరఫున పోటీపై సందిగ్ధం నెలకొంది. 2014లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోటీలో కాంగ్రెస్‌కు మంచి మెజార్టీ ఉన్న సమయంలో ఆ పార్టీ తరపున మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ వెంకటరమణారెడ్డి తన నామినేషన్ దాఖలు చేసి, ఆ తరువాత ఉపసంహరించుకుని డాక్టర్ భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కారణమయ్యారు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్‌ను అదే భయం వెంటాడుతోంది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అభ్యర్థిని ఎంపిక ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కాంగ్రెస్‌ నుంచి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డిలు పోటీలో ఉన్నట్టు సమాచారం. అయితే వారు చివరి రోజు(గురువారం) నామినేషన్ వేయనున్నారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో అనధికారికంగా కలిసి నడిచిన బీజేపీ, కాంగ్రెస్‌లు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మాత్రం ఎవరికి వారే పోటీలో ఉండటంతో త్రిముఖపోరు అనివార్యమైంది. ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడి ఎన్నికకు 724 ఓటర్లు ఉండగా.. అందులో కాంగ్రెస్‌కు 140, బీజేపీకి 85 మంది సభ్యుల బలం ఉంది. ఇక మిగిలిన సభ్యులంతా టీఆర్ఎస్‌కు చెందిన వారే. క్రాస్ ఓటింగ్ జరగకపోతే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకనే చెప్పవచ్చు. మెజార్టీ సభ్యుల బలం కారణంగానే నిన్న మొన్నటి వరకు చాలామంది టీఆర్ఎస్ నాయకులు 20 నెలల ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. అధిష్టానం మాజీ ఎంపీ కవిత నామినేషన్ వేయడంతో 23న టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లోయలపల్లి నర్సింగ్ రావు తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తరువాత మూడు పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటే మాత్రం త్రిముఖపోరు ఖాయంగా కనిపిస్తోంది.

Tags : Nizamabad, MLC By Election, TRS Ex MP Kavitha, Congress, BJP


Next Story