ముగ్గురు ముగ్గురే !

by  |
ముగ్గురు ముగ్గురే !
X

దిశ, కరీంనగర్: ఆ ముగ్గురు అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ తర్వాత కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన కరీంనగర్‌లో వ్యాధి నివారణకు ఈ ముగ్గురు తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రపంచాన్నే కలవరపెడుతున్న కరోనా ఇండోనేషియన్ల రూపంలో కరీంనగర్ తలుపు తట్టింది. దీంతో అలర్ట్ అయిన జిల్లా అధికారులు కో ఆర్డినేషన్‌తో పరిఫెక్ట్ ప్లాన్ అమలు చేస్తున్నారు.

కరీంనగర్ కలెక్టర్ కె. శశాంక గద్వాల జిల్లా నుండి కరీంనగర్‌కు బదిలీపై వచ్చారు. అంతకుముందు కరీంనగర్ బల్దియా కమిషనర్‌గా పని చేశారు. ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న కలెక్టర్ శశాంక కరోనా నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏఏ శాఖల మధ్య సమన్వయం ఉండాలి, తదితర అంశాలపై ప్రణాళికా బద్దంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇండోనేషియన్లు సంచరించిన ప్రాంతాల్లో మెడికల్ సర్వే చేయించడంలో అయినా, ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు విషయంలో అయినా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ నమోదయిందంటే చాలు ప్రభుత్వ పరంగా ఏం చర్యలు చేపట్టాలి, నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ అన్న విషయాలపై నిర్ణయం తీసుకుని చకచకా ఆ దిశగా అధికారయంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓ వైపున వివిధ శాఖలతో సమీక్ష జరుపుతూనే మరో వైపున జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సౌకర్యాలను మెరుగు పర్చడం, ఐసోలేషన్ వార్డులో డ్యూటీ చేసే వారికి కావల్సిన కిట్లను సమకూర్చడం వరకు ఆదేశాలు ఇస్తున్నారు.

అంతేకాకుండా సివిల్ ఆస్పత్రిలో బాధ్యతలను వికేంద్రీకరణ చేసి ఇంఛార్జీలపై ఉన్న బరువును తగ్గించే ప్రయత్నం చేశారు. అలాగే వలస కూలీలకు ఉచిత బియ్యం అందించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద వహించారు. లాక్‌డౌన్ సమయంలో ధరల నియంత్రణతో పాటు సామాజిక దూరం అన్న విషయంపై అత్యంత ప్రాధాన్యతగా మారింది. దీంతో కూరగాయల మార్కెట్లను సువిశాలమైన ప్రాంతాలకు తరలించి అక్కడ రెవెన్యూ సహాయకులను వాలంటీర్లుగా నియమించే విషయంలో కూడా కలెక్టర్ తీసుకున్న చొరవే. అలాగే కరోనా విషయంలో ప్రైవేటు వైద్యుల భాగస్వామ్యం ఉండే విధంగా ఐఎంఏ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంతో కరీంనగర్ ఐఎంఏ యూనిట్ ప్రతినిధులు కరోనా కట్టడిలో ఎక్కువగా ఇన్ ‌వాల్వ్ అవుతున్నారు.

పోలీస్ కమిషనర్ విబి. కమలాసన్‌రెడ్డి శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా కరోనా అనుమానితులను క్వారంటైన్ సెంటర్లకు తరలించడం, మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారిని గుర్తించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే కార్డన్ ఆఫ్ చేసిన ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించే అంశంలో వ్యూహ రచన చేసి సక్సెస్ అయ్యారు. లాక్‌డౌన్ తర్వాత నగరంలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కొన్నిచోట్ల కఠినంగా వ్యవహరించారనే చెప్పాలి. క్షేత్ర స్థాయిలో పనిచేసే పోలీసు యంత్రాంగంపై బరువు బాధ్యతలు వదిలేసి అడపాదడపా వాకీటాకీల్లోనో మొబైల్ ఫోన్లలోనో వాకబు చేసే విధానంతో సరిపెట్టకుండా ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు కలిసొచ్చింది. అక్కడ ఎదురైన అనుభవాలను పాఠాలుగా మల్చుకున్న సీపీ అలాంటి ఘటనలు ఇక్కడ రిపిట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రోన్ కెమెరాల నిఘాను కూడా తన ట్యాబ్ నుండే పర్యవేక్షిస్తూ జనం రోడ్లపై లేకుండా చర్యలు తీసుకుంటున్నారంటే ఆయన ఎంత సీరియస్ గా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

బల్దియా కమిషనర్ వల్లూరి క్రాంతి రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉండే కరీంనగర్‌లో బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ప్రబలిన కరోనా వ్యాధి ఆమెకు సరికొత్త అనుభవాన్నే అందించనుంది. నగరంలో వలస కూలీలను గుర్తించడంలో ఆమె పాత్ర కీలకమనే చెప్పాలి. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన కార్మికులు నగరంలోని స్మార్ట్ సిటీకి సంబంధించిన నిర్మాణ పనుల్లో పనిచేశారు. వీరు శాతవాహన యూనివర్శిటీలో చిక్కుకుని పోగా వారికి బాసటగా నిలిచారు. ప్రధానంగా నగరంలో బ్లీచింగ్ స్ప్రే చేయించడం, మునిసిపల్ వర్కర్స్ చే పారిశుధ్య పనులు నిరాటంకంగా జరిపించడంలో సఫలం అయ్యారు. నగరంలో ఇండోనేషియన్లు పర్యటిచించిన ప్రాంతాన్ని కార్డన్ ఆఫ్ చేయడంతో అక్కడ నివసించే వారికి కూరగాయల సరఫరా కోసం మునిసిపల్ వర్కర్స్‌ను వినియోగించారు. కార్పొరేషన్ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కరోనా కట్టడిలో తనవంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో ముగ్గురు అధికారులు సమన్వయంతో కరోనా కట్టడిపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. వ్యాధి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ప్రాంతాల్లో కలెక్టర్, సీపీ, కమిషనర్‌లు ముగ్గురు కలిసే క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఆయా కాలనీల్లో చేపట్టాల్సిన చర్యలపై ముగ్గురు అధికారులు కూడా ఓ నిర్ణయానికి వచ్చి అందుకు అనుగుణంగా పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కార్డన్ ఆఫ్ చేసిన ప్రాంతాల్లో కూడా ముగ్గురు కలిసే తిరిగి అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇండోనేషియన్లకు పాజిటివ్ రావడంతో వారిని డైరక్ట్ కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్ చేయడం వారిని ఐసోలేషన్ లేదా క్వారంటైన్ సెంటర్లకు పంపించే విషయంలో ముగ్గురు అధికారులు పక్కా ప్లాన్ వేసుకునే పనిచేశారు

Next Story

Most Viewed