విద్యుత్ షాక్ ఘటనలో మరొకరు మృతి.. అనాథ అయిన చిన్నారి

by  |
Fire
X

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో సోమవారం జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో స్పాట్‌లోనే తండ్రి, కూతురు మృతి చెందగా… కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. ఇస్నాపూర్ లో సోమవారం మధ్యాహ్నం జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. అక్కడికక్కడే బసుదేవ్ మాలిక్(36), చిన్న కూతురు కూన్ మాలిక్ (2) లు మృతి చెందగా తీవ్ర గాయాలైన భార్య రీనా మాలిక్ (25) చందానగర్ లోని పిఆర్ కె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబంలో ముగ్గురు మృతి చెందగా స్కూలుకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డ పెద్ద కూతురు అనాథ అయింది.

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, జిల్లా కార్యదర్శి కె.రాజయ్యలు సందర్శించి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాలనీలో విషాదఛాయలు మధ్య మంగళవారం రాత్రి ముగ్గురికి దహన సంస్కారాలు నిర్వహించారు.

విద్యుత్ శాఖ కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే కుటుంబం బలయిపోయిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.రాజయ్య అన్నారు. కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో పెద్ద కూతురు అనాథ అయిపోయిందని విచారం వ్యక్తం చేశారు. కాలనీలో 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలని ఎప్పటి నుంచో కాలనీవాసులు చెబుతున్నా విద్యుత్ శాఖ పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. ఈ ఘటనలో విద్యుత్ శాఖ తీవ్ర నిర్లక్ష్యం ఉందని, మృతుల కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed