కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ ఏది?

by  |
King Koti Hospital
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆక్సిజన్ అందక హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆదివారం ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి చెందారు. ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా ఆసుపత్రికి చేరుకోవడంతో ఉదయం నుంచి ఆక్సిజన్ అందక పేషెంట్లు చనిపోయారు. మరోవైపు డబ్బులు ఇస్తేనే ఆక్సిజన్ పెడతామని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారని కోవిడ్ బాధితులు వాపోతున్నారు.

ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నా.. ముందస్తుగా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,578 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయగా వీటిలో 5,086 మంది పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. ఆక్సిజన్ కోసం ఏర్పాటు చేసిన అన్ని బెడ్లకు సరిపడా ఆక్సిజన్‌ను అందించలేకపోతున్నారు. హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో ఏర్పడిన పరిస్థితులే ఇందుకు ఉదాహరణగా చెప్పుకొవచ్చు.

కింగ్ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్సలు అందించేందుకు మొత్తం 350 బెడ్లను ఏర్పాటు చేశారు, వీటిలో అత్యధికంగా 300 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయగా 50 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో 290 మంది పేషెంట్లు ఆక్సిజన్ బెడ్లలో చికిత్సలు పొందుతుండగా 50 మంది ఐసీయూ బెడ్లలో చికిత్సలు పొందుతున్నారు. ఆక్సిజన్ బెడ్లలో చికిత్సలు పొందుతున్నవారందరికి ఆక్సిజన్‌ను అందించడంలో ఆసుప్రతి సిబ్బంది పూర్తిగా వైఫల్యం చెందింది. ఆదివారం ఉదయం నుంచి సరిపడా ఆక్సిజన్ నిల్వలు లేకపోవడంతో ఆక్సిజన్ బెడ్లలో చికిత్సలు పొందుతున్న వారిలో 50శాతం మందికే ఆక్సిజన్‌ను అందిస్తున్నారు.

ఆక్సిజన్ కొరతను అవకాశంగా తీసుకున్న ఆసుపత్రి సిబ్బంది పేషంట్లకు ఆక్సిజన్ అందించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రూ.1000 నుంచి 2000 వరకు లంచాన్ని అందిస్తే వెంటనే సంబంధిత పేషెంట్లకు ఆక్సిజన్ అందిస్తున్నారు. డబ్బులు చెల్లించుకోలేని పేషెంట్ల పరిస్థితులు ఇక అంతే సంగతులు. ఆక్సిజన్ కొరీత ఏర్పడితే పేషెంట్ల ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ముందుస్తుగా ఆక్సిజన్‌ను నిల్వ చేసుకోవడం లేదు.



Next Story

Most Viewed