తెలంగాణలో మూడో కరోనా కేసు

by  |
తెలంగాణలో మూడో కరోనా కేసు
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో మూడో కరోనా కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా బులెటిన్ విడుదలకాలేదు. కానీ, కేంద్ర వైద్యారోగ్య శాఖ మాత్రం ఆదివారం (మార్చి 15) సాయంత్రం ఐదు గంటల సమయానికి దేశం మొత్తం మీద 107 కరోనా పాజిటివ్ నిర్ధారణ కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో మూడు పాజిటివ్ కేసులు ఉన్నట్లు స్పష్టం చేసింది. అత్యధికంగా మహారాష్ట్రలో 31 పాజిటివ్ కేసులుండగా ఆ తర్వాతి స్థానంలో కేరళలో 22 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 11 కేసులు ఉన్నట్లు పేర్కొనింది. తెలంగాణలో కరోనా నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం శనివారం రాత్రి సమావేశమై నిర్ణయం తీసుకునే సమయానికి రాష్ట్రంలో రెండు పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఆదివారం ఉదయానికి మరో పాజిటివ్ కేసు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. మూడో కేసు.. ఇటీవల నెదర్లాండ్స్ వెళ్ళి వచ్చిన వ్యక్తి అని తేలింది. ఆయనతో సంబంధాలు ఉన్నవారిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇప్పటికే గుర్తించినట్లు రాష్ట్ర వర్గాల సమాచారం. వారికి కూడా పరీక్షలు నిర్వహించి అవసరాన్ని బట్టి 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఒక పాజిటివ్ పేషెంట్ చికిత్స చేయించుకుని నెగటివ్ రిపోర్టు రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

కరోనా అనుమానిత లక్షణాలతో ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులో పలువురు చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా 1,123 మంది అనుమానితులను గుర్తించింది. ఇందులో 18 మంది వైద్యపరీక్షల నివేదికలు ఇంకా అందాల్సి ఉంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున కరోనా అనుమానిత లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిలో, పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలో విదేశీయులెవరూ లేరు. ఇప్పటిదాకా దేశం మొత్తం మీద పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలో 17 మంది మాత్రమే విదేశీయులు మిగిలిన 90 మంది మన దేశానికి చెందినవారేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

tags : Telangana, Corona Patients, three, Gandhi Hospital, Covid-19



Next Story

Most Viewed