వైసీపీలో పదవుల జాతర… ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు?

by  |
CM Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీలు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఆ పదవులను దక్కించుకునేందుకు పార్టీకి చెందిన కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఇద్దరు అభ్యర్థులు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప నుంచి ఈసారి కూడా మరోకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ ఎం. గోవిందరెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలే గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ పదవీకాలం ముగసింది. మరోసారి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత లబ్బి వెంకటస్వామికి ఈ సారి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. వెంకటస్వామిది కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామం. గతంలో ఈయన కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్‌గా, నందికొట్కూరు ఎమ్మెల్యేగా పని చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు ఈసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మోషేన్‌రాజును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి అవకాశం కల్పించాలని వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మండలిలో ఇప్పటికే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ముగ్గురుకి అవకాశం దక్కింది.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన పండుల రవీంద్ర బాబుకు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్ రాజు, చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తిలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది వైసీపీ హైకమాండ్. అయితే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు అవకాశం కల్పించారు. తాజాగా లబ్బి వెంకటస్వామికి అవకాశం ఇస్తే సామాజిక సమతుల్యతను పాటించినట్లు అవుతుందని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed