వాళ్ల టార్గెట్ మహిళలే.. ఆ ముగ్గురు కలిసి గ్రామాలే అడ్డాగా..

by  |
Meena Finance
X

దిశ, రాయలసీమ : చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్‌గా ఓ ముఠా మోసాలకు దిగుతోంది. సెంథిల్ కుమార్, రాజ్ కుమార్, సంగీత అనే వ్యక్తులు జట్టుగా మీనా ఫైనాన్స్ కంపెనీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన కార్యాలయం ఉన్నట్లు తప్పుడు చిరునామా చూపించి మహిళలను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. కూలీ చేసుకుని కూడబెట్టుకున్న సొమ్మును రుణాల పేరిట కాజేసి నట్టేట ముంచేశారు. పొదుపు పేరుతో డబ్బులు మింగేసి ఊడాయించారు.

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, బి.ఎన్ కండ్రిగ ప్రాంతాల్లో మీనా ఫైనాన్స్ కంపెనీ పేరుతో ఈ మోసానికి తెరలేపారు. సెంథిల్ కుమార్, రాజ్ కుమార్, సంగీత ముఠాగా ఏర్పడి పేద మహిళలకు ఆర్థిక సహాయం చేస్తామని, వడ్డీ లేకుండా ఒక్కో గ్రూపుకు 50 వేల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేస్తామని చెప్పి ఆయా గ్రామాల్లో కరపత్రాలతో ప్రచారం చేశారు. ప్రభుత్వ పొదుపు సంఘాల మాదిరిగానే ఉండటంతో మహిళలు ఇది నిజమేనని నమ్మారు. దీంతో గ్రామాల్లో పది మంది చొప్పున గ్రూపులతో మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.

అయితే గ్రూపులో కాగానే మీనా ఫైనాన్స్ కంపెనీ తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. సంఘానికి లోన్ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కో గ్రూప్ నుంచి రూ.10 వేల నుంచి 15 వేలు ఇవ్వాలని షరతు పెట్టింది. రుణాలు వస్తాయని ఆశపడిన మహిళలు సంగీత, రాజ్ కుమార్ పేర్లతో ఉన్న ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశారు.

అయితే డబ్బులు జమ చేసి నెలలు గడిచినా రుణాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన మహిళలు సంస్థ నిర్వహకుల కోసం వాకాబు చేసింది. అప్పటికే వాళ్లు పరారీ కావడంతో తాము మోసపోయామని గ్రహించారు. చివరకు బాధిత మహిళలు తమకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ గడప తొక్కారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సంస్థ నిర్వహకుల కోసం గాలిస్తున్నారు.


Next Story

Most Viewed