రెండు కప్పుల ఉప్పు నీటితో.. 45 రోజుల కాంతి

by  |
రెండు కప్పుల ఉప్పు నీటితో.. 45 రోజుల కాంతి
X

దిశ, ఫీచర్స్ : ‘అంధకారం’లో ఉన్న ప్రపంచానికి వెలుగులు ప్రసరింపజేసింది ‘విద్యుత్’. కాగా బల్బు కనిపెట్టినప్పటి నుంచి నేటి వరకు ఎలక్ట్రిసిటీని రకరకాల పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దక్షిణ అమెరికాకు చెందిన ఇంజనీర్లు వాటర్‌లైట్‌ను అభివృద్ధి చేశారు. ఇది కేవలం రెండు కప్పుల ఉప్పు నీటితోనే కాంతి, విద్యుత్‌ను అందించడం విశేషం. ఆ అద్భుతమైన ఆవిష్కరణను మొదట ‘ఫాస్ట్‌ కంపెనీ’ నివేదించగా, కొలంబియన్ రెనెవబుల్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి) స్టార్టప్ కంపెనీ ‘ఇ-దినా’ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

ఉప్పు నీరు వాటర్‌లైట్‌లోని మెగ్నీషియంతో జరిపే చర్య.. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన సాధారణ రసాయన ప్రతిచర్యకు కారణమవుతుంది. ఈ మేరకు రెండు కప్పుల నీటితో ఉత్పత్తి అయిన కరెంట్‌తో ఈ వాటర్‌లైట్‌ 45 రోజుల పాటు వెలుగుతుంది. ఈ ప్రక్రియలో ఉప్పు, నీరు వేరవుతాయి. ఒకవేళ వాటర్‌లైట్ వెలుగు అందించలేని స్థితికి చేరినప్పుడు, అందులో మిగిలి ఉన్న నీటిని వంట కోసం ఉపయోగించవచ్చు. సాధారణంగా ఈ లైట్‌ 2-3 సంవత్సరాల వరకు వర్క్ చేస్తుంది. ఆ తరువాత దాన్ని రీసైకిల్ చేయవచ్చు. దక్షిణ అమెరికాకు ఉత్తర తీరాన గల ఎడారి ప్రాంతం గువాజీరా ద్వీపకల్పంలోని ప్రజలకు ‘ఇ-దినా’ కంపెనీ ఈ లైట్లను అందించింది. కాగా పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంత ప్రజలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు.

ఈ లైట్లు కిరోసిన్ లేదా ఆయిల్ ఆధారిత దీపాలను భర్తీ చేయగలవని ‘ఇ-దినా’ కంపెనీ భావిస్తోంది. అంతేకాదు ద్వీపకల్పానికి చెందిన వాయుయు తెగ సభ్యులు రాత్రిపూట సముద్రంలోకి చేపల వేటకు వెళ్తుంటారు. వారి పడవల్లో లైటింగ్ కోసం కూడా ఈ లైట్లు ఉపయోగపడుతుండగా.. వీటి సాయంతో మొబైల్ ఫోన్లను చార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు చిన్నపాటి రేడియోకు కూడా శక్తినివ్వగలవు. ఈ లాంతర్స్ రూపొందించం కొంచెం ఖర్చుతో కూడుకున్నదే కాగా, వీటి ధర 60 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ఉంటుంది. అయితే ఈ దీపాలను లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రపంచంలోని పేద తీర ప్రాంతాలకు పంపిణీ చేయాలని ఇ-దినా యోచిస్తోంది.



Next Story

Most Viewed