వెన్నముద్ద కృష్ణుడిగా మ‌ల‌య‌ప్ప స్వామి

by  |
వెన్నముద్ద కృష్ణుడిగా మ‌ల‌య‌ప్ప స్వామి
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మలయప్ప స్వామి వెన్నముద్ద కృష్ణుడిగా కనువిందు చేశారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై శంఖు, చక్రం, గ‌థ‌‌, అభ‌య‌హ‌స్తం ధ‌రించి చ‌తుర్భు‌జ కేశ‌వ‌మూర్తి అలంకారంలో దర్శనమిచ్చారు.

చంద్రప్రభ వాహనం – సకలతాపహరం

చంద్రుడు శివునికి శిరో భూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుంచి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజోపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

వాహ‌న‌ సేవ‌లో పెద్దజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, టీటీడీ చైర్మన్ ​వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, ధర్మకర్తల మండ‌లి స‌భ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నిశ్చిత‌, శివ‌కుమార్‌, శేఖ‌ర్ రెడ్డి, గోవింద‌హ‌రి, డిపి అనంత‌, ఆలయ డిప్యూటి ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ‌ని‌వారం ఉద‌యం 7గంట‌ల‌కు సర్వభూపాల వాహ‌నం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.



Next Story

Most Viewed