త్వరలోనే సైన్యంలోకి ‘నాగ్’ క్షిపణి

by  |
త్వరలోనే సైన్యంలోకి ‘నాగ్’ క్షిపణి
X

దిశ, వెబ్ డెస్క్ : దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మూడో తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ‘నాగ్’ తుది పరీక్షలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో గురువారం తెల్లవారుజామున నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైంది. దీంతో తయారీదశలోకి వెళ్లడమే కాదు, సైన్యంలోకి ప్రవేశించడానికి సంసిద్ధమైంది.

గురువారం అనామిక నుంచి ప్రయోగించిన నాగ్ యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణి… టార్గెట్‌గా పెట్టుకున్న డమ్మీ ట్యాంక్‌ను పేల్చేసిందని డీఆర్‌డీవో తెలిపింది. దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ‘నాగ్’ భారీ ఆయుధ సంపత్తి కలిగి, దృఢమైన రక్షక కవచం కలిగిన యుద్ధ ట్యాంకులను పేల్చేస్తుంది. కనీసం 500 మీటర్ల నుంచి గరిష్టంగా నాలుగు కిలోమీటర్ల రేంజ్‌లోని లక్ష్యాలను ఈ క్షిపణి సునాయసంగా విధ్వంసం చేసేస్తుంది.

ఈ క్షిపణి ఇప్పటికే వింటర్, సమ్మర్ ట్రయల్స్‌ను గతేడాది పూర్తిచేసుకున్నది. తాజాగా తుది పరీక్షలో నెగ్గడంతో నాగ్ క్షిపణి తయారీదశలోకి వెళ్లిందని డీఆర్‌డీవో ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వరంగ రక్షణ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఈ క్షిపణులను తయారుచేయనుందని తెలిపింది. అనామిక (నాగ్ మిసైల్ క్యారియర్)ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ-మెదక్ తయారుచేస్తుందని వివరించింది.



Next Story

Most Viewed