బడుల ప్రారంభంపై తర్జనభర్జన …

by  |
schools opening
X

దిశ ప్రతినిధి, మెదక్ : పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర విద్యాశాఖ తర్జనభర్జన పడుతుంది. బడులు తెరవాల వద్దా … ప్రత్యక్ష బోధన కొనసాగించాలా .. ఆన్ లైన్ లొనే తరగతులు నిర్వహించాలో ఎటూ తేల్చుకోలేకపోతుంది. విద్యాశాఖ నుండి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం ఫలితంగా విద్యార్థులు బడికి వెళ్లేందుకు సిద్ధం కావాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 25 నుండి ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు వెళ్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం పాఠశాల సమయం ముగియగానే తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు.

తర్జన భర్జన …

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరువేల పాఠశాలలు ఉండగా అందులో ఏడెనిమిది లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న విషయం తెలిసిందే. గత వారం క్రితం జరిపిన విద్యాశాఖ సమీక్షలో ఈ నెల 25 నుండి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలి, జూలై 1 వ తేదీ నుండి దశల వారీగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. అంతలోనే ఏమైందో తెలియదు . మళ్లీ స్కూళ్లు ప్రారంభించాలా వద్దా అన్న చర్చ విద్యాశాఖలో జోరుగా సాగుతుంది. మరో 15 రోజుల పాటు ప్రత్యక్ష బోధన వాయిదా వేయాలని ఆలోచన చేసినట్టు సమాచారం.

ఆన్లైన్ క్లాసులకే మొగ్గు ….

కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో రాష్ట్ర విద్యాశాఖ మరో కొత్త ఆలోచన చేసింది. ప్రస్తుతానికి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను వాయిదా వేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు 9, 10 తరగతుల వారికి ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. వారి ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే గతేడాది నిర్వహించిన ఆన్లైన్ క్లాసుల్లో ఎవరూ పాఠాలు వినలేదు. చాలా గ్రామాల్లో నెట్ వర్క్ ప్రాబ్లం, టీవీలు లేకపోవడం పలు సమస్యలు తాండవించాయి. తాజాగా మళ్లీ ఆన్లైన్లో కాసులు నిర్వహిస్తామనడంపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా కారణంగా అందరికి ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. మళ్లీ ఆన్ లైన్ క్లాసులంటే మోబైల్ ఫోన్ కొనాల్సిందేనా అంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

సందిగ్ధంలో విద్యార్థులు …

బడుల ప్రారంభంపై స్పష్టత కరువవ్వడంతో విద్యార్ధులు స్కూలకు వెళ్లాలా లేదా అన్న సమాలోచనలో పడ్డారు. మొన్నటి విద్యాశాఖ ప్రకటనలో చాలా మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. గతేడాది ఇచ్చిన స్కూల్ యూనిఫాం ను ఇస్త్రీ చేసుకోవడం, కుట్లు పోయిన చోట టైలర్ దగ్గరికి వెళ్లి కుట్లు వేయించుకోవడం, స్కూల్ కు వెళ్లే సమయంలో మాస్కు శానిటైజర్ , నోటుపుస్తకాలు కొనుగోలు చేసి రెడీగా ఉన్నారు. కొందరు విద్యార్ధులేమో విద్యాశాఖ నుండి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వేచి చూద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

యాభై శాతం ఉపాధ్యాయులు హాజరు

ఈ నెల 25 నుండి పూర్తి స్థాయిలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉ న్న అందరు ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. పాఠశాలలకు విద్యార్థులు రానందున గతేడాది సూదిరిగానే 50 శాతం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి కవితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన మంత్రి జులై 1వ తేదీ నుండి 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువాడుతాయని సమాచారం. మొత్తానికి నిర్మాణాల నుండి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందళన చెందుతున్నారు. ఈ విషయంపై త్వరలో చర్చించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story