'తరుగు పేరిట దగా చేస్తున్రు'

by  |
తరుగు పేరిట దగా చేస్తున్రు
X

దిశ, మెదక్: దేశానికి వెన్నెముకలా ఉన్న రైతన్న కష్టాలు అంతా ఇంతా కావు. ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దగాపడుతూనే ఉన్నారు. తరుగు పేరుతో రైతన్నకు శఠగోపం పెడుతున్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై ధాన్యంలో కోత కోస్తూ రైతులను మోసం చేస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇదే తంతు కొనసాగుతోన్నది. ఈ వ్యవహారాన్ని జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. పెద్ద మొత్తంలో ధాన్యం విక్రయించే రైతులకు అదే స్థాయిలో నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు.

మెదక్ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎక్కడిక్కకడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 205 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు కేటాయించిన టోకెన్ల ఆధారంగా ఆయా కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలవుతోన్నది. రైతులు తెచ్చిన ధాన్యంలో తేమశాతం, పొల్లు పేరుకుపోయిందంటూ కొన్ని కేంద్రాల్లో 40 కిలోల బ్యాగులో 42 కిలోల తూకం వేస్తున్నారు. మరికొన్ని చోట్ల 41 కిలోల తూకం వేస్తున్నారు. కానీ, రైతుకు కట్టించేది మాత్రం 40 కిలోలు మాత్రమే. ఒక రైతు ఎకరాకు సుమారుగా 12 నుంచి 14 క్వింటాళ్ల ధాన్యం పండిస్తారు. 14 క్వింటాళ్ల ధాన్యం తూకంలో క్వింటాల్ కు దాదాపుగా 5 కిలోల కోత విధిస్తున్నారు. ఇలా 14 క్వింటాళ్లకు 70 కిలోల తరుగు పేరుతో మాయమవుతుంది. ఇలా వేలాది ఎకరాల ధాన్యంలో తరుగు పేరా వందల క్వింటాళ్ల ధాన్యం రైతుల నుంచి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం తరుగు, పొల్లు పేరా కోత పెట్టిన ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో వేరుగా పెడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కుతూ మిల్లర్లకు, ప్రజాప్రతినిధులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు చేస్తేనే ధాన్యం బస్తాలను మిల్లులోకి అనుమతిస్తున్నారు. 40 కిలోల బస్తాకు 2 కిలోల ధాన్యం అదనంగా తూకం వేయాలని, లేనిపక్షంలో తాము తీసుకోమని ఖరాఖండిగా చెబుతున్నట్లు సమాచారం. ఇలా వ్యాపారులు, అధికారులు, నేతలు కుమ్మక్కై రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో పంటంతా నీళ్లపాలవుతున్నా కనికరించకుండా అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు, నేతల మధ్య సయోధ్య..

రైతుల కష్టాలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులే రైతుల కంట్లో పొడుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, రైస్ మిల్లర్లు కొర్రీలు పెడితే న్యాయం చేయాల్సిన నేతలు వారితో కుమ్మక్కై రైతుల కడుపు కొడుతున్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. అయితే క్వింటాల్ ధాన్యం కోత విధిస్తుండడంతో తూతూ మంత్రంగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ రైతులను ఒప్పించడంలో ప్రజాప్రతినిధులు ఉత్సాహం చూపిసున్నారు. ఇందుకు అధికారులతో సమన్వయం చేసుకొని తరుగు తీసేలా చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెదక్ మండలంలో ఇద్దరు నేతలు ఈ విషయంలో ముందడుగు వేసినట్లు తెలుస్తోన్నది. తరుగు ద్వారా పోగైన ధాన్యం రైస్ మిల్లుల యజమానులతో కుమ్మకై కేంద్రాల నిర్వాహకుల పేర్లతో విక్రయించినట్లు విశ్వసనీయ సమాచారం.

కొనుగోలు కేంద్రాల్లో మోసాన్ని అరికట్టాలి: దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ నాయకులు

లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఆరుగాలం కష్టపడిన రైతులు వడగళ్ల వానలతో తీవ్ర నష్టాలు చవిచూశారు. రైతులు పండించిన ధాన్యం ఐకేపీ సెంటర్లకు తీసుకువెళ్తే 40 కిలోల బస్తాకు రెండు కిలోల ధాన్యాన్ని ఎక్కువగా తూకం వేస్తూన్నారు. ఒక క్వింటాల్ కు రెండు బ్యాగులతో మొత్తానికి నాలుగు కిలోల ధాన్యాన్ని అన్యాయంగా రైతుల పొట్ట కొట్టి దోచుకుంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటికే వ్యవసాయ అధికారులు మూడు లక్షల క్వింటాళ్ల వరిధాన్యం సేకరించామని తెలిపారు. ఒక క్వింటాల్ కు 4 కిలోలు అన్యాయంగా దోచుకుంటే, మూడు లక్షల క్వింటాళ్లకు ఎంత దోచుకున్నారో స్పష్టమవుతోన్నది.

Tags: Rice grain, farmers, purchase, depreciation, fraud, officials, merchants



Next Story

Most Viewed