ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

by  |
Srikanth
X

దిశ, దుబ్బాక: సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో కలకలం రేగింది. నిరుద్యోగానికి మరో యువకుడు బలయ్యాడు. ఉద్యోగం రాలేదని మరో నిరుద్యోగి నేల రాలిన ఘటన పెద్దగుండవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఏఎస్ఐ లక్ష్మన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన బిర్లా శ్రీకాంత్ (25) తమ వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. శ్రీకాంత్ మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుని, పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాయగా కొద్ది మార్కుల తేడాలో మిస్సైందని చెప్పారు. అయినా రెండు నెలల నుంచి సిద్దిపేటలో ఉంటూ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడన్నారు.

కాగా, శ్రీకాంత్ మూడు రోజుల క్రితం స్వగ్రామమైన పెద్దగుండవెల్లికి వచ్చాడని తెలిపారు. ఉన్నట్టుండి మంగళవారం ఉదయం తన చెల్లెలుకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పాడు. వెంటనే ఆమె సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ లక్ష్మన్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.



Next Story

Most Viewed