భర్తకు వీడియో కాల్ చేసి లైవ్‌లో ఉరేసుకున్న భార్య

by  |
Ramya
X

దిశ, ఏపీ బ్యూరో: ఏడేళ్ల క్రితం ఆ జంట పెళ్లి చేసుకుంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తపై అలిగిన భార్య పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత తనను తిరిగి తీసుకెళ్లాలని ఒత్తిడి చేయగా భర్త రాకపోవడంతో తట్టుకోలేకపోయింది. భర్తకు వీడియోకాల్‌ చేసి లైవ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లె టూటౌన్‌ పీఎస్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనంతపురం జిల్లా బాబే నాయక్‌ తండాకు చెందిన చక్రే నాయక్‌, కమలమ్మ దంపతులు ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వలస వచ్చారు. ఎస్బీఐ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. చక్రేనాయక్‌ వాచ్‌మెన్‌గా, కమలమ్మ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఒక్కగానొక్క కుమార్తె అయిన రమ్యశ్రీని కర్ణాటకకు చెందిన చందునాయక్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు ప్రస్తుతం 11 నెలల కుమార్తె సంతానం. అయితే దంపతుల మధ్య కొంత కాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో భర్తపై అలిగిన రమ్యశ్రీ ఇటీవలే తన పుట్టింటికి వచ్చేసింది.

భర్తపై అలకపోవడంతో తనను కాపురానికి తీసుకెళ్లాలని రమ్యశ్రీ భర్తను కోరింది. అయితే చందు నాయక్ మాత్రం నోరు మెదపడం లేదు. రమ్యశ్రీ శుక్రవారం కూడా భర్తకు ఫోన్ చేసింది. భర్తకు వీడియో కాల్‌ చేసి కాపురానికి తీసుకెళ్లమని బ్రతిమిలాడింది. అయినప్పటికీ చందునాయక్‌లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో వీడియో కాల్‌లోనే చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోతానని హెచ్చరించింది. అయినా భర్త స్పందించికపోవడంతో రమ్యశ్రీ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

వెంటనే చందు అత్త కమలమ్మకు ఫోన్‌చేసి ఈ విషయం చెప్పాడు. కమలమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి ఫ్యానుకు వేళాడుతూ కుమార్తె విగతజీవిగా కనిపించింది. స్థానికుల సహాయంతో రమ్యశ్రీని కిందకు దించి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న టూటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.

అల్లుడి వేధింపుల కారణంగానే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని అత్త కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో చందుపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసు కూడా నమోదైనట్లు తెలిపింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు.

Next Story