భర్తను హతమార్చమని ప్రియుడ్ని కోరిన భార్య… చివరికి ఏం జరిగిందంటే..?

by  |
Illegal Affair
X

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: అక్రమ సంబంధం మోజులో కట్టకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. ప్రియురాలి కోసం ఆమె భర్తను పథకం ప్రకారం హత్య చేశాడు ప్రియుడు. స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ రఘునందన్ వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాలు… ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఆకుల మహేష్ కు అదే గ్రామానికి చెందిన అశ్విని తో వివాహం జరిగింది. వివాహానికి ముందే అశ్విని స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన పసుల కుమార్ తో ప్రేమలో పడింది. మహేష్ తో పెళ్లి అయిన తర్వాత కుమార్ తో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది అశ్విని. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని ప్రియున్ని కోరింది. దీంతో పసుల కుమార్ పథకం ప్రకారం ఈనెల 5వ తేదీన మహేష్ ను ఘట్‌కేసర్ నుండి నమిలికొండ కు తీసుకు వచ్చాడు. కుమార్ బావమరిది పాలెపు కృష్ణ తో పాటు మరో ఇద్దరిని కలుపుకొని జఫర్గడ్ లో మద్యం సేవించారు.

అదే రోజు రాత్రి మృతుడు మహేష్, కుమార్, కృష్ణ ముగ్గురు నల్గొండ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం మత్తులో ఉన్న మహేష్ తలపై బండరాయితో మోదీ చంపారు. మహేశ్ మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడేసి వెళ్లిపోయారు. 6న మహేశ్ భార్య అశ్విని తన భర్త మహేశ్ కనిపించడం లేదని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఘట్‌కేసర్ పోలీసులు స్టేషన్‌ఘన్‌పూర్ పోలీసుల సహకారంతో మృతుడి సెల్ ఫోన్ లోకేషన్, చివరి కాల్ ఆధారంగా పసుల కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా గుట్టు రట్టు అయినట్లు ఆయన తెలిపారు. నేరాన్ని అంగీకరించిన పసుల కుమార్, అతనికి సహకరించిన పాలెపు కృష్ణ లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. మృతుని భార్య అశ్విని పరారీలో ఉన్నట్లు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story