‘నా భర్తను చిత్రహింసలకు గురిచేశారు’

by  |
‘నా భర్తను చిత్రహింసలకు గురిచేశారు’
X

దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన భాషబోయిన ప్రవీణ్(30) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడని బంధువులు తెలిపారు. ప్రవీణ్ మృతికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కారణమని, హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మృతుని బంధువులు మంగళవారం రాత్రి ఆందోళన నిర్వహించారు. మృతుని బంధువుల వివరాల ప్రకారం… ప్రవీణ్ తన స్నేహితునితో కలిసి హుజురాబాద్ వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గంమధ్యలో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతని స్నేహితుడు వెంటనే హుజరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. ప్రవీణ్ మృతికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు.

కాగా ఇదే ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌ను విధులు సరిగా చేయడం లేదని, ఆస్పత్రి సూపరింటెండెంట్ నాలుగు నెలల క్రితం తొలగించారన్నారు. దీంతో ప్రవీణ్ హైకోర్టును ఆశ్రయించగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిందని అయినప్పటికీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ప్రవీణ్ విధుల్లోకి తీసుకోలేదని తెలిపారు. వైద్యుని వేధింపుల కారణంగానే ప్రవీణ్ గుండెపోటుతో మరణించాడని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని సీఐ మాధవి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ మాధవి తెలిపారు.

బుధవారం మృతుని భార్య మీడియాతో మాట్లాడుతూ… కరోనా కిట్ల విషయంలో ఆసుపత్రి సూపరిండెంట్ నా భర్తను తప్పుడు రిపోర్టు తయారు చేయాలని ఆదేశించగా, అందుకు ఒప్పుకోకపోవడంతో తన భర్త ప్రవీణ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాడని ఆరోపించింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద తప్పుడు కేసులు పెట్టించాడని వివరించింది. దీంతో పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే తన భర్తను స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారని వాపోయింది. దీంతో తన భర్త మానసిక ఆందోళనకు గురై మృతిచెందాడని, తన భర్త మృతికి ఆసుపత్రి సూపరింటెండెంట్, పోలీసులే కారణమని వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.


Next Story

Most Viewed