తెలంగాణకు ఐదు ‘ఉత్తమ‘ అవార్డులు.. ప్రకటించిన కేంద్రం

by  |
Union Home Ministry
X

దిశ‌, కాళోజీ జంక్ష‌న్ : నేరాల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ 2021 సంవత్సరానికి అవార్డులను ప్రటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 152 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేయగా అందులో తెలంగాణకు చెందినవారు ఐదుగురు ఉన్నారు. వివిధ రకాల నేరాల దర్యాప్తులో వారు ప్రదర్శిస్తున్న ప్రతిభను మరింతగా ప్రోత్సహించడానికి, ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పడానికి 2018 నుంచి కేంద్ర హోంశాఖ ఈ అవార్డులను ప్రదానం చేస్తూ ఉన్నది. గరిష్టంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సీబీఐల నుంచి 11 మంది చొప్పున ఎంపిక కాగా ఉత్తరప్రదేశ్ నుంచి పది మంది, కేరళ నుంచి తొమ్మిది మంది చొప్పున ఉన్నారు.

తెలంగాణ నుంచి ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ముగ్గురు ఏసీపీలు, ఒక డీఎస్పీ, ఒక ఎస్ఐ ఉన్నారు. దర్యాప్తులో నైపుణ్యం కనబరిచి నేరాన్ని కోర్టులో నిరూపించి నేరస్తులకు శిక్ష పడేందుకు కృషి చేసినందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వర్థన్నపేట, మామూనూర్ డివిజన్ ఏసీపీలుగా పనిచేసిన మధుసూధన్, శ్యాంసుందర్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. జఫరగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో గరిమళ్ళపల్లి గ్రామ శివారులో ఇద్దరు నిందితులు, ఒక మైనర్ నిందితుడు మహిళపై యాసిడ్ తో దాడి చేసి హత్య చేసిన సంఘటనకు సంబంధించి అప్పటి వర్థన్నపేట ఏసిపి మధుసూధన్ చేపట్టిన దర్యాప్తులో ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడగా మరో మైనర్ నేరస్తుడికి జైలు శిక్ష పడింది. ఈ దర్యాప్తులో కీలకంగా నిలిచినందుకుగాను మధుసూధన్‌ ఎంపికయ్యారు.

గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గతేడాది మే మాసంలో తొమ్మిది మందిని బ్రతికి వుండగానే బావిలో పడేసి హత్యచేసిన సంఘటనలో నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించేలా నైపుణ్యంతో దర్యాప్తు చేపట్టిన అప్పటి మామూనూర్ ఏసీపీ శ్యాంసుందర్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మధుసూధన్ ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తుండగా శ్యాం సుందర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏసీపీగా పనిచేస్తున్నారు. ఏసీపీగా పనిచేస్తున్న నాయిని భుజంగరావు, మరో ఏసీపీ శ్యాం ప్రసాద్‌రావు, ఎస్ఐ నీనావత్ నగేష్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed