గ్రేటర్​లో ఏంటీ పరిస్థితి..?!

by  |
గ్రేటర్​లో ఏంటీ పరిస్థితి..?!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంత ప్రచారం చేసినా ఫలితం అంతంతే.. అంతా చదువుకున్నేళ్లే అయినా చైతన్యం మాత్రం శూన్యమే.. సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టమంటే టైం గ్యాప్​ ఇవ్వని బిజీ.. హక్కుల గురించి మాట్లాడమంటే గుక్కుతిప్పుకోకుండా కొనసాగింపు.. కానీ బాధ్యతగా ఓటేయమంటే మాత్రం యమ బిజీగా నటిస్తూ, ఏమీ పట్టనట్టు వ్యవహారం.. సగటు గ్రేటర్​ ఓటరు మైండ్​ సెట్​ ఇది.. నాయకులు అది చేయలేదు, ఇది చేయలేదంటూ మాట్లాడిన మహాశయులు మరీ ఓటేయడానికి ఎందుకు ఉత్సాహం చూపడం లేదనేదే అతి పెద్ద సందేహం. ఎప్పుడు గ్రేటర్​ ఎన్నికలు వచ్చినా తగ్గుతున్న పోలింగ్​ శాతమే వారి అతి బద్ధకానికి నిదర్శనం.

పట్నమోళ్లు బద్ధకస్తులని మరోసారి రుజువైంది. ఓటుపై పల్లెలో ఉన్న చైతన్యం పట్టణాల్లో కరువైంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఓటు హక్కుపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా విద్యావంతులు, ధనవంతులు, బస్తీవాసులు ఓటేసేందుకు దూరమవుతూనే ఉన్నారు. మంగళవారం జరిగిన గ్రేటర్​ పోలింగ్​లో ఓటర్లు ముఖం చాటేశారు. పోలింగ్​ కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో పోలింగ్​ శాతం గణనీయంగా తగ్గింది. మరోవైపు పలు అంశాల్లో వ్యతిరేకత కూడా ఓటర్లను పోలింగ్​కు దూరం చేసింది. అటు ప్రైవేట్​ సంస్థలు కూడా ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు ఇవ్వలేదు. గ్రేటర్​ పరిధిలో పని చేసే ప్రభుత్వ సంస్థలు కూడా నామమాత్రంగా సెలవులు ఇచ్చాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులు విధులకు రావాలంటూ హెచ్చరించాయి.

ఎందుకేయాలి..?

ఓటు వేయాలని వెళ్లిన నేతలకు కాలనీల్లో చుక్కెదురైంది. ఒక దశలో జనాలు రాజకీయపక్షాలపై తిరగబడినట్టే చేశారు. అసలు ఎందుకు ఓటేయాలంటూ నిలదీశారు. ప్రధానంగా అధికార పార్టీ నేతలకు ఈ వ్యతిరేకత ఎక్కువ తగిలింది. వరద సాయం పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు ఓటింగ్​ శాతం తగ్గేందుకు ప్రభావం చూపింది. అర్హులకు వరద సాయం రాకపోవడం, వచ్చిన వారి నుంచి పార్టీ నేతలు సగం తీసుకోవడంతో జరిగిన అన్యాయంపై నిలదీస్తూ మండిపడ్డారు. చింతల్​ బస్తీలో ఇదే అంశంపై టీఆర్​ఎస్​ నేతను బస్తీకి రాకుండా వెళ్లగొట్టారు. ఓటు కూడా వేయమంటూ వెళ్లిపోయారు. మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకున్నా రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా బస్తీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రైవేట్​ ఉద్యోగుల దెబ్బ..

ఈసారి ప్రైవేట్​ ఉద్యోగుల ఓట్లు పోల్​ కాలేదు. కరోనా కారణంగా ప్రైవేట్​ ఉద్యోగులను తొలగించడంతో చాలా మంది గ్రామాలకు వెళ్లారు. ప్రధానంగా విద్యా సంస్థల్లో పని చేసేవారు పల్లెల్లోనే ఉన్నారు. కొంతమందిని రప్పించేందుకు ప్రయత్నాలు జరిగినా వర్క్​ అవుట్​ కాలేదు. దాదాపు ఆరున్నర లక్షల మంది ప్రైవేట్​ ఉద్యోగులు ఈసారి గ్రేటర్​లో ఓటింగ్​కు దూరంగా ఉన్నట్లు అంచనా. అలాగే, సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు మరోసారి బద్ధకస్తులయ్యారు. దాదాపు నాలుగున్నర లక్షల మంది ​​ ఉద్యోగులు వర్క్​ ఫ్రంహోం అని సొంతూళ్ల నుంచే చేస్తుండడంతో పోలింగ్​ శాతం తగ్గింది.

కీ బోర్డు వారియర్లేనా..?

ఇక వైట్‌ కాలర్‌ జాబులు చేసే వారు, టెకీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్‌ మూడు శాతం కూడా దాటకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జాబ్‌ హోల్డర్స్‌, టెకీల తీరును నెటిజనులు ట్రోల్‌ చేస్తున్నారు. ఓటు మన బాధ్యత అంటూ వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టడం కాదు.. వచ్చి ఓటు వేయడం ముఖ్యం అంటూ విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీ అలా.. ఈ పార్టీ ఇలా అన్ని తిట్టడానికి ముందుంటారు మరి ఓటేయడానికి ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓటుపై నిరాసక్తత ఎందుకు చూపిస్తున్నారని, మీకంటే నిరాక్షరాస్యులు మేలు.. ఓటు వేయడం తమ బాధ్యత అనుకుంటారని, సిటీ జనాలు కేవలం కీ బోర్డు వారియర్లేనా అని ట్రోల్​ చేస్తున్నారు.

వరుస సెలవులు ఓ కారణం..

గ్రేటర్‌ ఎన్నికల్లో తక్కువ పోలింగ్‌ నమోదు కావడానికి ప్రధాన కారణం వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం. అసలు పోలింగ్‌ రోజు సెలవిస్తేనే ఓటేసేందుకు బద్ధకిస్తారు, అలాంటిది ఈ గ్రేటర్​ పోరుకు వరుస సెలవులు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే ముందుగా సెలవుల అంశంలో ఎన్నికల సంఘమే చూసుకోవాల్సి ఉండేదని పలువురు పేర్కొంటున్నారు.

పోలింగ్‌ను పట్టించుకోని పార్టీలు

ప్రచారపర్వాన్ని ఉరకలెత్తించిన పార్టీలు పోలింగ్​ రోజు మాత్రం డీలా పడుతాయి. పోలింగ్​ శాతం పెరుగడం ఇష్టం లేకనో, ఓటర్లను తీసుకొచ్చి ఓటేయించడం కష్టమనో పోలింగ్​ను పట్టించుకోవడం లేదు. ఉదయం పోలింగ్​ చూస్తే మరీ దారుణంగా మారింది. ఓటర్లు లేక కేంద్రాలు బోసిపోయాయి. శివారు ప్రాంతాల్లో ఈసారి కొంత పోలింగ్​ మెరుగైంది.

కొవిడ్​ కూడా కారణమా…?

కొవిడ్ వల్ల కొంత ఓటింగ్ శాతం తగ్గిందని ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారధి ప్రకటించారు. ​ కేంద్రాల్లో కొవిడ్​ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకున్నా, అదే కారణహని చెప్పడం కరెక్ట్​ కాదని అధికారులు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు వస్తాయా…?

గత గ్రేటర్​ ఎన్నికల్లో మొత్తం 74,24,096 ఓట్లకు 33,62,688 (45.29 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో నోటాకు పోలైన ఓట్లు పోగా అభ్యర్థులు, స్వతంత్రులకు కలిపి 33,49,379 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో టీఆర్‌ఎస్‌ అత్యధికంగా 14,68,618 (43.85 శాతం) ఓట్లను దక్కించుకుంది. ఎంఐఎం 5,30,812 (15.85 శాతం) ఓట్లతో రెండో స్థానంలో ఉండగా… టీడీపీ 4,39,047 (13.11శాతం), కాంగ్రెస్‌ 3,48,388 (10.40 శాతం), బీజేపీ 3,46,253(10.34 శాతం) ఓట్లను సాధించాయి. ఇటు సీపీఐ 12,748 ఓట్లు, సీపీఎం 8,538, బీఎస్పీ 10,478, లోక్‌సత్తా 10,385, ఇతర రిజిస్టర్డ్‌ పార్టీలు 28,765, స్వతంత్ర అభ్యర్థులు 1,46,481 ఓట్లను దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఏ మేరకు ఓట్లు వస్తాయో మరో రెండు రోజులు ఆగితే మాత్రమే తెలుస్తుంది.


Next Story

Most Viewed