టూరిజం శాఖకు కరోనా పాజిటివ్

by  |
టూరిజం శాఖకు కరోనా పాజిటివ్
X

దిశ,తెలంగాణ బ్యూరో : కరోనాతో తెలంగాణ పర్యాటక శాఖ నష్టాలను ఎదుర్కుంటోంది. సంవత్సరం కింద దెబ్బతిన్న రంగం కోలుకుంటుందని సంతోషించిన సమయంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చి మళ్లీ రంగాన్ని ముంచిందని పర్యటక శాఖ ఉన్నతాధికారి ఆవేధన వ్యక్తం చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో తెలంగాణ టూరిజం అధికారులు ఉన్నారు. వేసవిలో బోగత జలపాతం ఇతర పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేవిధంగా పర్యాటక శాఖ చర్యలు తీసుకున్నా, మళ్లీ కరోనా సెకండ్ వేవ్ తో పర్యాటకులు రావడానికి జంకుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తెలంగాణకి రావడానికి సిద్ధంగా లేరని, ఇలాంటి పరిస్థితుల్లో బ్రాండ్ అంబాసిడర్లను నియమించినా ఎలాంటి ప్రయోజనం లేదనే భావన పర్యాటక శాఖ అధికారుల్లో ఉంది. కుదేలైన రంగాన్ని అభివృద్ధి పతంలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా పర్యాటకుల సంఖ్య పెరగడం లేదని అధికారులు చెబుతున్నారు. కానీ ఇదే పరిస్థితిని కేరళా ప్రభుత్వం మాత్రం ఆసరాగా తీసుకొని ప్రచారం చేసుకుంటూ పర్యాటకులను ఆహ్వానిస్తోంది.

కొవిడ్ దృష్ట్యా దేశంలో పర్యాటక రంగం కుదేలైపోయిన పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా యువతను ఆకర్షించి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ కారణంగా యువత పూర్తిగా డిజిటల్ ప్లాట్ ఫాం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ రంగంలో యువతను ఆకర్షించే విధంగా వ్లాగ్స్ చేస్తున్న దేశంలోని ప్రముఖ పది మంది యూట్యూబ్ వ్లాగర్స్ ని ఎంపిక చేసి కేరళ ప్రభుత్వం రాష్ట్రానికి ఆహ్వానించింది. ఈక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పది మంది యూట్యూబర్లు కేరళాకి చేరుకున్నారు. వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్లాగర్ అనీల్ గీలా కూడా ఉన్నారు.

లాక్డౌన్ తర్వాత అన్ని రంగాలు వృద్ధి చెందుతున్నా పర్యాటక రంగం మాత్రం సందర్శకుల తాకిడి లేక ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఈ క్రమంలో కేరళాలోని ప్రతి పర్యాటక ప్రదేశం సురక్షితం అని తెలిపేలా పర్యాటకులకు అవగాహన కల్పించేలా వ్లాగర్ల తో వీడియోల ద్వారా ప్రచారం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీరంతా కలిసి ఐదు రోజులు, ఆరు రాత్రులు కేరళలోని వివిధ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించడమే కాకుండా అక్కడి సంస్కృతి, వంటకాలు, కళలను దేశంలోని ప్రజలకు వివరించి కేరళా రాష్ట్రాన్ని సందర్శించాలనే విధంగా వీక్షకులకు అనుభూతిని కలిగిస్తారు. ఇలాంటి చర్యలను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించనేలేదు. బ్రాండ్ అంబాసిడర్లను నియమించి వారిపై అధిక వ్యయాన్ని ఖర్చు చేసే బదులు ఇలాంటి వనూత్న కార్యక్రమాలను జరపడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.



Next Story

Most Viewed