ట్రయల్ రన్ ఫెయిల్?

by  |
ట్రయల్ రన్ ఫెయిల్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరికొంత కాలం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేకులు పడనున్నాయి. ధరణి పోర్టల్‌‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలే కారణమని సమాచారం. అందుకే రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్లు మరికొన్ని రోజుల పాటు వాయిదా పడనుంది. ఈ విషయాన్ని ‘దిశ’ శనివారం ‘వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 23 నుంచి డౌటే’ అన్న శీర్షికతో ఇచ్చిన కథనం నిజమైంది. శనివారం సాయంత్రానికి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. హైకోర్టులో కేసు విచారణలో ఉంది. రిజిస్ట్రేషన్లపై స్టే విధించింది. ఈ నెల 23న హైకోర్టు మరోసారి విచారించనుంది. ఈ కారణాల వల్ల 23 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్లు మరో మూడు నాలుగు రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు ప్రకటించాయి. కానీ సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రారంభిస్తారని సీఎం కేసీఆర్ 15వ తేదీన ప్రకటించారు. ఆ రోజు సుదీర్ఘంగా అధికారులతో సమీక్షించిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటించారు.

అయితే రిజిస్ట్రేషన్లు ప్రారంభించకపోవడానికి కారణం సాంకేతిక సమస్యలేనని సమాచారం. చిక్కడపల్లిలోని సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయంలో చీఫ్​సెక్రటరీ సోమేష్ కుమార్​నేతృత్వంలోనే చేస్తున్నారు. అయితే ఇప్పటి దాకా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్‌‌ను పరిష్కరించలేదని తెలిసింది. పైగా ఓపెన్​ప్లాట్ల క్రయ విక్రయాల్లో అనేక రకాల డీడ్స్ ఉంటాయి. ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు సంబంధించి సేల్‌డీడ్, మార్ట్‌గేజ్, జీపీఏ, ఏజీపీఏ, పార్టిషన్, రిలీజ్, డెవలప్మెంట్ అగ్రిమెంటు, గిఫ్టు‌డీడ్​ఇలా అనేకం ఉంటాయి. వాటన్నింటికి సంబంధించిన సాంకేతిక దన్ను ధరణి పోర్టల్‌లో కల్పించాలి. ఇప్పటికీ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా కేవలం సేల్‌డీడ్ ప్రక్రియకు మాత్రమే ఆప్షన్ ఉంది. మిగతా అంశాలకు సంబంధించిన ఇష్యూస్ పెండింగులోనే ఉన్నాయి. వీటన్నింటినీ రూపొందించి ట్రయల్ రన్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆరంభించనున్నారు.

రియల్టర్ల నుంచి వ్యతిరేకత

ఇప్పటికే 23వ తేదీ నుంచి మొదలు పెట్టే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎల్‌ఆర్‌ఎస్‌‌తో సంబంధం లేకుండానే నిర్వహించాలంటూ రియల్టర్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. అయితే 29 లక్షల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించకుండా మొదలు పెట్టినా సమస్యలు ఉత్పన్నం అవుతాయని అధికారులు చెబుతున్నారు. దాంతో పాటు బల్దియా ఎన్నికల్లోనూ ప్రభావం చూపించనుంది. అందుకే ఇప్పుడప్పుడే మొదలు పెట్టి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతోనే వాయిదాకు కారణమన్న వాదన కూడా ఉంది. ఇంకెన్ని రోజులు వరకు రియల్టర్లు వేచి చూడాలో అర్ధం కావడం లేదని మండిపడుతున్నారు.

Next Story

Most Viewed