స్వర్ణప్యాలస్ ఘటనపై నేడు సుప్రీంలో విచారణ

by  |
స్వర్ణప్యాలస్ ఘటనపై నేడు సుప్రీంలో విచారణ
X

దిశ, ఏపీ బ్యూరో : విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రమేష్ హాస్పిటల్స్ ఎండీ రమేష్ బాబు, ఛైర్మన్ సీతారామ్మోహనరావుపై తదుపరి చర్యల్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కొన్నాళ్ల కిందట ప్రభుత్వం పిటిషన్‌ వేసింది.

విజయవాడ రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యాన స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహించిన కొవిడ్ కేర్ సెంటర్‌లో ఆగస్టు 9న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీనిపై రమేష్ ఆస్పత్రి ఛైర్మన్ సీతారామ్మోహనరావు, ఎండీ రమేష్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని సవాలు చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. రమేష్‌బాబు, సీతారామ్మోహన్‌రావుపై తదుపరి చర్యలు తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

ప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందని హైకోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై విచారణకు హైకోర్టు ఆదేశాలు అడ్డుగా ఉన్నాయని, స్టే ఇవ్వాలని కోరింది. అగ్ని ప్రమాదంపై విచారణ ముందుకు సాగితేనే నిజనిజాలు బయటకు వస్తాయని, ప్రాథమిక దశలోనే చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదని పిటిషన్‌లో పేర్కొంది.

దీనిపై జస్టిస్ ఫాలీ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ అంశంలో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని రమేష్ హాస్పిటల్ ఛైర్మన్ సీతారామ్మోహనరావు కేవియట్ వేశారు. ఇవాళ ఇరుపక్షాల వాదనలు కొనసాగే అవకాశం ఉంది.

Next Story

Most Viewed