వాడివేడిగా మున్సిపల్ సమావేశం.. చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్

by  |
Suryapet Municipal Council meeting
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు తమ వార్డులకు నిధులు కేటాయించడం లేదని నిరసన తెలిపారు. తన వార్డుకు నిధులు మంజూరు చేయడం లేదని 12వ వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ ఏకంగా తన చెప్పుతో తననే కొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో సమావేశం రసాభాసాగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లకు మధ్య వాదోపవాదాలు జరిగాయి.

అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్, అసెంబ్లీ, జిల్లా పరిషత్ వంటి సమావేశాలకు మీడియాకు అనుమతి ఇస్తున్నారని మున్సిపల్ సమావేశాలకు మీడియాను నిషేధించడం ఏంటని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇటీవల తాను ప్రధాని నరేంద్ర మోడీని కలిశానని, త్వరలో ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారని, ఆ ట్రైన్‌ను హైదరాబాద్ నుండి సూర్యాపేట మీదుగా విజయవాడకు పొడిగించాలని కోరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.రామంజుల రెడ్డి, వైస్ ఛైర్మన్ పుట్టా కిషోర్, సూర్యాపేట కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed