లొంగిపోయిన మావోయిస్టు వివరాలివీ: ఎస్పీ

by  |

దిశ, వరంగల్: ములుగు జిల్లా పోలీసుల ఎదుట మావోయిస్టు దళ సభ్యుడు లొంగిపోయాడు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ అతడి వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. ‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన వెట్టి ఐతు అలియాస్ ఐతాలు‌ ఆరేళ్ల క్రితం మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు ఆకర్షితుడై దళ సభ్యుడిగా చేరాడు. దళ సభ్యునిగా కొనసాగుతూ మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హరి భూషణ్, దామోదర్, వెంకటేష్, ఆజాద్, భాస్కర్, బండి ప్రకాష్ కు నమ్మకస్తుడిగా మారాడు. 2016 వరకు చర్ల దళ సభ్యుడిగా పని చేసిన అనంతరం పార్టీ ఆదేశాల మేరకు స్టేట్ కమిటీ ఇన్ చార్జ్, తెలంగాణా స్టేట్ మిలిటరీ చీఫ్ బడే చొక్కారావు @ దామోదర్ కు గార్డ్ గా నియమితుడయ్యాడు. 2017 లో ట్రైనింగ్ చేస్తూ కిందపడిపోగా అతని వెన్నుపూసకు దెబ్బ తగిలి ఇబ్బంది పడుతున్నాడు. పార్టీలో పని చేయలేక లొంగిపోవాలని నిశ్చయించుకుని పార్టీ అగ్రనేతలకు అనుమతి కోరాడు. వారు నిరాకరించి 2019లో ఏరియా కమిటీ మెంబర్ గా ప్రమోషన్ ఇచ్చి బడే చొక్కారావు @దామోదర్ కు గార్డ్ ప్రొటెక్షన్ టీం కమాండర్ గా పదోన్నతిని కల్పించారు. ఈ క్రమంలో వెన్నుపూస(బ్యాక్ పెయిన్) నొప్పి‌‌ ఎక్కువ అవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి ఎస్. ఎస్ తాడ్వాయి మండలం కామారంలోని అతని బాబాయి సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు’ అని ఎస్పీ తెలిపారు.


Next Story

Most Viewed