'వన్ నేషన్- వన్ రేషన్‌'ను అమలు చేయండి – సుప్రీం కోర్టు

by  |
Supreme Court Fires On AP
X

న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూలై 31 నాటికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ‘వన్ నేషన్- వన్ రేషన్ కార్డు’ పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పథకం కింద వలస కార్మికులు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ తీసుకునే సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ సందర్బంగా విధించిన ఆంక్షల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి సామాజిక కార్యకర్తలు అంజలీ భరద్వాజ్, జగదీప్ చొక్కర్‌లు గతంలో పిటిషన్ వేశారు. పిటిషన్‌ పై అశోక్ భూషణ్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గిపోయే వరకు వలస కూలీలకు రేషన్ పంపిణీ చేసేందుకు గాను రాష్ట్రాలకు, యూటీలకు ఉచితంగా ఆహార ధాన్యాలను కేటాయించాలనీ కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా కరోనా పాండెమిక్ ముగిసే వరకు వలస కార్మికులకు ఆకలి తీర్చేందుకు రాష్ట్రాలు ‘కమ్యూనిటీ కిచెన్‌లు’ నడపాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అంతే కాకుండా సంక్షేమ పథకాల లబ్ది పొందేందుకు అసంఘటిత రంగ కార్మికుల వివరాలు నమోదు చేసేందుకు వీలుగా నేషనల్ ఇన్ ఫార్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) సహకారంతో ఓ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ ప్రక్రియను జూలై 31లోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.



Next Story