మీడియాను నియంత్రించలేం : సుప్రీంకోర్టు

by  |
మీడియాను నియంత్రించలేం : సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా కీర్తించబడుతున్న మీడియాను నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టులలో జరిగే విచారణను నివేదించకుండా మీడియాను నిలువరించలేమని స్పష్టం చేసింది. కోర్టులలో విచారణ సందర్భంగా జరిగే మౌఖిక వ్యాఖ్యలను రిపోర్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు పైవిధంగా స్పందించింది. దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ సరిగ్గా చేపట్టలేదని, ‘మీపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడద’ని గతనెల 27న మద్రాస్ హైకోర్టు ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

దీనిని సవాల్ చేస్తూ ఈసీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ సందర్భంగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ‘కోర్టుల్లో జరిగే విషయాలను రిపోర్టు చేయకుండా మేం మీడియాను నియంత్రించలేం. న్యాయస్థానాల్లో జరిగే విచారణల సందర్భంగా.. ఏం జరిగిందన్న విషయాన్ని మీడియా పూర్తిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కోర్టు ఉత్తర్వులు, విచారణలు, మౌఖిక వ్యాఖ్యలు తెలుసుకోవాలని ప్రజలకు ఆసక్తి ఉంటుంది. మీడియా అనేది పవర్‌ఫుల్ వాచ్‌డాగ్. అది ప్రతి వ్యవస్థను ప్రజలతో అనుసంధానం చేసే సాధనం’ అని తెలిపింది. ఇక మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలను ఈసీ సరైన దారిలో తీసుకోవాలని సూచించింది. కోర్టుల పనితీరుపై ఈసీ తమకు చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.


Next Story

Most Viewed