మా మద్దతు వారిద్దరికే.. క్యాంపు నుంచి ‘దిశ’ ఎక్స్‌క్లూజివ్ వీడియోలు

by  |
మా మద్దతు వారిద్దరికే.. క్యాంపు నుంచి ‘దిశ’ ఎక్స్‌క్లూజివ్ వీడియోలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా, మా హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారికే మద్దతు ఉంటుందని మంథని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ క్యాంపు నుండి వీడియోలు విడుదల చేశారు. ఎంపీపీలు, జడ్పీటీసీల హక్కుల కోసం పోరాడుతున్న వారికే తాము ఓటు వేస్తామని స్ఫష్టం చేశారు. ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సారా బుడ్ల ప్రభాకర్ రెడ్డితో పాటు మంథని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇనుముల సతీష్‌కే తమ ఓట్లు వేస్తామని వెల్లడించారు. క్యాంపులో ఉన్న తమ వైఖరిని స్పష్టం చేస్తున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అయితే తమపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, తామే స్వచ్చందంగా క్యాంపునకు వచ్చి తమ ఓట్లు అన్ని కూడా ఒక్కతాటిపై ఉండాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. అయితే కొంతమంది ఇతర పార్టీ నాయకులు తమపై చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. తాము ఎవరికి మద్దతు ఇస్తున్నామో బాహాటంగా చెప్తున్నామని అయితే బీజేపీ పార్టీ వైఖరి ఏంటో వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. మంథని కాంగ్రెస్ స్థానిక ఓటర్లమంతా ఏకతాటిపై ఉన్నామని, బీజేపీ ప్రజా ప్రతినిధులు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బీజేపీ ఓటర్లు టీఆర్ఎస్ క్యాంపుల్లో ఉన్నారంటే.. ఆ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దుతు ఇవ్వాలి అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయిందని మండిపడ్డారు. మీడియాకు విడుదల చేసిన ఈ వీడియోల్లో మహదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ, కాటారం, మల్హర్, పల్మెల ఎంపీపీలు పంతకాని సమ్మయ్య, మల్హర్ రావు, బుచ్చక్కలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.


Next Story