ఎవరూ.. హాజరు కాలేదు

by  |
ఎవరూ.. హాజరు కాలేదు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: దేశంలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ ఐదు జాతీయ సంఘాలు ఇచ్చిన 72 గంటల సమ్మెలో భాగంగా మూడవ రోజు సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని బొగ్గు గనులలో కార్మికులు విధులు బహిష్కరించారు. రీజియన్ లోని ఆరు భూగర్భ గనులు, నాలుగు ఓపెన్ కాస్ట్ గనులలో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో రామగుండం రీజీయన్ లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. రీజియన్ లోని 14 వేల మంది కార్మికులలో అత్యవసర విధులు నిర్వహించే కార్మికులు మినహా ఎవరూ హాజరు కాలేదు. దీంతో 135 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. రామగుండం రీజియన్ నుంచి ఎన్టీపిసి విద్యుత్ కేంద్రానికి రోజు 35 వేల టన్నుల బొగ్గును సింగరేణి సరఫరా చేస్తుండగా సమ్మె కాలంలో నిలువ ఉన్న బొగ్గును రవాణా చేస్తోంది. మిగతా వినియోగ దారులకు బొగ్గు రవాణా నిలిచి పోయింది. సమ్మెతో కార్మికులు తమ వేతనాలను కోల్పోయారు. 72 గంటల సమ్మెలో భాగంగా బొగ్గు గనులపై జాతీయ కార్మిక సంఘాలైన బీఎంఎస్, ఐఎన్ టీయూసీ, ఎఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గనుల సమీపంలో ర్యాలీతో పాటు దర్నా నిర్వహించారు. మొదటి రోజు సమ్మెకు మద్దతు ప్రకటించిన గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ రెండు రోజులు సమ్మెకు దూరంగా ఉంది. అయినప్పటికీ కార్మికులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెతో కేంద్రం దిగి వచ్చి వెంటనే బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపి వేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed