ధరణి ట్రయల్ రన్

by  |
ధరణి ట్రయల్ రన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ధరణి పోర్టల్ రెండో భాగం ఆవిష్కృతం కానుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ట్రయల్ రన్ నడుస్తోంది. గడిచిన పది రోజుల నుంచి ప్రక్రియను అమలు చేస్తున్నారు. సెలవు రోజుల్లోనూ రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. ప్రతి ఉద్యోగికి ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో డమ్మీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆదివారం కూడా సబ్ రిజిస్ట్రార్లు నాలుగైదు రిజిస్ట్రేషన్లు చేశారు. సోమవారం కూడా ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల విధులకు వెళ్లని వారంతా ప్రస్తుతం కార్యాలయంలో ఇదే అంశంపై శిక్షణ పొందుతున్నారు. మొదట సేల్‌డీడ్ ఆప్షన్ మాత్రమే ఇచ్చారు. తాజాగా గిఫ్ట్‌డీడ్, పార్టిషన్ డీడ్, అగ్రిమెంట్ డీడ్.. వంటి పది రకాల దస్తావేజుల ప్రక్రియను నడుపుతున్నారు. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుకే సెలవు రోజుల్లోనూ పని చేస్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్లు చెప్పారు. హై‌కోర్టులో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశంపై కేసు విచారణలో ఉంది. అది పూర్తయితే వెంటనే ప్రభుత్వం రిజిస్ట్రేషన్లపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నమోదైన డేటా ప్రకారమే

ఇప్పటి వరకు ధరణి పోర్టల్ నమోదు చేసిన వ్యవసాయేతర ఆస్తుల డేటాతోనే రిజిస్ట్రేషన్ల ట్రయల్ రన్ నడుస్తోంది. హైకోర్టు కేసు ఓ కొలిక్కి వస్తే తప్ప పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికీ ఓపెన్ ప్లాట్ల అంశంపై లెక్క తేల్చలేదు. ఆ డేటాను ఏ ప్రాతిపదికన క్రోడీకరిస్తారో అంతుచిక్కడం లేదు. అధికారుల దగ్గర కూడా సరైన సమాచారం లేదు. ప్లాట్ల అంశం తేలకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అమలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లలో ఇండ్ల కంటే పదింతలు ఖాళీ స్థలాల క్రయ విక్రయాలే అధికంగా ఉంటాయి. కేవలం ఇండ్ల డేటాతో మొదలు పెట్టినా రిజిస్ట్రేషన్ల సంఖ్య పది శాతానికి మించకపోవచ్చునంటున్నారు. ప్రభుత్వం వీటిపై అధ్యయనం చేసి ఓ నిర్ణయానికి వస్తే తప్ప ఆశించిన ప్రయోజనం నెరవేరదంటున్నారు. దాంతో పాటు తమ ప్లాట్లను క్రమబద్ధీకరించాలంటూ 29 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిష్కరించడం ద్వారానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు పరిపూర్ణత లభిస్తుందంటున్నారు. రెండు నెలలుగా రియల్టర్లు, అనేక మంది క్రయ విక్రయాల కోసం ఎదురుచూస్తున్నారు.


Next Story

Most Viewed