సరుకులు సమయానికి అందేనా..!

by  |
సరుకులు సమయానికి అందేనా..!
X

– రెండో విడతలో కంది పప్పూ పంపిణీ

దిశ, రంగారెడ్డి: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ప్రజలు కనీస అవసరాలకు ఇబ్బంది పడొద్దని ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. అందులో భాగంగా రేషన్ కార్డుదారులకు రెండో విడత బియ్యం, బ్యాంక్ ఖాతాల్లో రూ.1,500, జన్ ధన్ ఖాతాల్లో రూ.500 చొప్పున నగదు జమ చేస్తున్నాయి. నేటి నుంచి ఖాతాల్లో నగదు జమ అవుతుందని జిల్లాల లీడ్ బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, సోమవారం నాటికి ఇంకా రేషన్ సరుకులు, నగదు అందలేదు.

బియ్యంతో కంది పప్పు ఇచ్చేనా..

రంగారెడ్డి జిల్లాలో 919, వికారాబాద్ జిల్లాలో 588 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో రంగారెడ్డిలో 5,24,887, వికారాబాద్‌లో 2,34,983 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ రెండు జిల్లాలో కార్డుల్లో నమోదైన 25,55,146 మందికి 12 కిలోల చొప్పున సుమారు 40వేల మెట్రిక్ టన్నుల బియ్యం, ప్రతికార్డుకు కిలో చొప్పున కంది పప్పు పంపిణీ చేయనున్నారు. బియ్యం జిల్లాలోని రేషన్ షాపులకు సరఫరా చేస్తున్నారు. కంది పప్పు సంగారెడ్డి గోదాము నుంచి రావాల్సి ఉందని పౌరసరఫరాల అధికారులు వివరించారు. త్వరలోనే అర్హులైన అందరికీ పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికా రూ.1,500 నగదును ఆధార్‌సంఖ్యతో లింకైన బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే, కొన్ని రేషన్‌ కార్డులకు బ్యాంకు ఖాతా, ఆధార్‌ సంఖ్య అనుసంధానం లేకపోవడంతో, వారి ఖాతాలకు నగదు జమ కావడం లేదు. ఇలాంటి వారు మరోమారు వివరాలు అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదే పద్ధతిలో ఖాతాలో జమ..

మూడు నెలల పాటు ప్రతి నెల రూ.500 చొప్పున జన్‌ధన్‌ ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత నెల జమ చేశారు. ఈ నెల లబ్దిదారుల ఖాతా నెంబర్లోని చివరి అంకె ఆధారంగా జమ చేయనున్నట్లు తెలిపారు. నిర్ణయించిన తేదీల్లో బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోవచ్చని వెల్లడించారు.

చివరి అంకె బ్యాంకులో జమయ్యే తేదీ
1. చివరి అంకె 0 కానీ 1 4.5.2020

2. చివరి అంకె 2 లేక 3 5.5.2020

3. చివరి అంకె 4 లేక 5 6.5.2020

4. చివరి అంకె 6 లేక 7 8.5.2020

5. చివరి అంకె 8 లేక 9 11.5.2020

Tags: distribution of rice, money, account, corona help, people, the second installment


Next Story