మే డే నుంచి రెండో విడత రేషన్ బియ్యం పంపిణీ: పౌరసరఫరాల శాఖ

by  |
మే డే నుంచి రెండో విడత రేషన్ బియ్యం పంపిణీ: పౌరసరఫరాల శాఖ
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు రెండో విడత సాయమందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మే డే నుంచి తలా పన్నెండు కిలోల చొప్పున ఉచిత రేషన్ బియ్యం అందించనుంది. మే డే బ్యాంకులకు సెలవు కావడంతో తలా రూ. 1500 చొప్పున నగదు సాయం మాత్రం మే 2 తారీఖు నుంచి కార్డుదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఖాతాలు లేనివారికి పోస్టాఫీసుల్లో జమ చేయనుంది. ఈసారి ప్రయోగాత్మకంగా నాలుగు జిల్లాల్లో ఒక్కో కార్డుకు కిలో చొప్పున కందిపప్పును కూడా ఉచితంగానే అందజేయనుంది. ఇది ప్రస్తుతానికి నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ రూరల్, మెదక్ జిల్లాల్లో అమలులోకి రానుంది. నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి 8,754 మెట్రిక్ టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 3,233 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని, అందువల్లనే నాలుగు జిల్లాల్లో తొలుత అమలు చేయాలనుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మిగిలిన జిల్లాల్లో 15వ తేదీన కందిపప్పును అందజేయనున్నట్టు తెలిపింది.

రేషన్ లబ్ధిదారులు సామాజిక దూరాన్ని పాటిస్తూ టోకెన్లు ఇచ్చిన నిర్దేశించిన సమయానికి వచ్చి రేషన్ తీసుకోవాలని సూచించింది. సాధారణ రోజుల్లో ప్రతి నెలా 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ పంపిణీ జరిగేదని, లాక్‌డౌన్ రోజుల్లో ప్రజల సౌకర్యార్థం ఏప్రిల్ నెలలో 23వ తేదీ వరకు పంపిణీ చేసినట్లు వివరించింది. మే నెలలో కూడా కార్డుదారులందరికీ రేషన్ అందించే వరకూ చౌకధరల దుకాణాలు తెరిచే ఉంటాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ ముగిసేవరకూ ప్రజలకు ప్రభుత్వ సాయమందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించిన విధంగానే ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన పంపిణీ దాదాపుగా పూర్తయిందని పేర్కొంది.

Tags: KCr,telangana, civil supply,Telangana, corona, lockdown, free rice, banks, food security


Next Story

Most Viewed