భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది: ఎమ్మెల్యే సతీష్ కుమార్

by  |
trs mla sathis kumae
X

దిశ, హుస్నాబాద్: గౌరవెల్లి భూనిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టును ప్రభుత్వం రూపకల్పన చేసింది అన్నారు. అందులో భాగంగానే భూ నిర్వాసితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే, కొంతమంది నిర్వాసితులను రాజకీయంగా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల నాయకులు ఒకవైపు ప్రాజెక్టు పూర్తి కావడం లేదని గగ్గోలు పెడుతూనే, మరోవైపు నిర్వాసితులను గ్రామాలు విడిచి వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు చేస్తున్న దీక్షా శిబిరం వద్ద రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్ పై అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన, టీఆర్ఎస్ ప్రభుత్వం 90శాతం పనులు పూర్తి చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఎకరాకు రూ. 6.95 ఇచ్చిందని, ఇటీవల ఎకరాకు రూ. 15 లక్షల చొప్పున నష్టపరిహారం కూడా చెల్లించిందన్నారు. గౌరవెల్లి రైతులను, గ్రామస్తులను నిర్వాసితులను ప్రభుత్వం దాగా చేసినట్లు మాజీ మంత్రి ఈటల చెప్పడం రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. ఈటెల రాజేందర్ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవెల్లి భూనిర్వాసితులకు ఎందుకు న్యాయం చేయలేకపోయారో ప్రజలకు చెప్పాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ కింద 3,760 ఎకరాల భూమి గాను రూ.176.82 కోట్ల పరిహారం ఇవ్వగా, 817 ఇండ్లకు రూ.93.94 కోట్ల డబ్బులు ప్రభుత్వం నిర్వాసితులకు చెల్లించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 18 ఏండ్లు నిండిన యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకుని వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.

Next Story