టీఆర్ఎస్ గ్రేటర్ టీం రెడీ.. వారిదే పెత్తనం

by  |
టీఆర్ఎస్ గ్రేటర్ టీం రెడీ.. వారిదే పెత్తనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి అధికార పక్షం సిద్ధమైంది. 2016 ఎన్నికల వ్యూహాన్నే తిరిగి అనుసరించనుంది. అందుకే శివారు ప్రాంతాలపైన ఫోకస్​ పెట్టింది. ప్రధానంగా ఎల్బీనగర్​, ఉప్పల్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్​, మల్కాజిగిరి, కూకట్​‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్​, పటాన్​ చెరు నియోజకవర్గాల్లోని డివిజన్లలో గెలిచేందుకు వ్యూహరచన చేసింది. అందుకే ఆయా డివిజన్లలో గెలుపు బాధ్యతను పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించింది. కొన్ని చోట్ల ఇద్దరేసి ఇన్ చార్జీలను నియమించారు. సిట్టింగు కార్పొరేటర్లు కూడా ఈ ప్రాంతాల్లోనే అధికం. అందుకే సిట్టింగు డివిజన్లను కోల్పోకుండా ప్రజాప్రతినిధులకు మార్గ నిర్దేశం చేశారు. పార్టీ ప్రచార బాధ్యతలను, ఇతర అన్ని అంశాలను చూసుకునేందుకు టీంను ఎంపిక చేశారు. అలాగే గతంలో మాదిరిగానే టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ షెడ్యూల్​ ఖరారు బాధ్యతలకు ప్రత్యేకంగా బృందాన్ని నియమించారు. అందులో మేయర్ బొంత రామ్మోహన్​, ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్​ ధర్మేందర్​ రెడ్డిలు ఉన్నట్లు సమాచారం. పూర్తి బాధ్యతలను వారే నిర్వర్తించనున్నారు. ఐతే గతంలో బాల్క సుమన్​ ఈ బృందంలో లేరు. అలాగే రెండేసి నియోజకవర్గాలకు ఒకరు పర్యవేక్షకులుగా బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధం చేశారని సమాచారం. అయితే కేటీఆర్ టీం గ్రేటర్​ ఎన్నికల పూర్తి బాధ్యతలను చేపట్టింది. అభ్యర్ధులకు పార్టీ ప్రచార సామాగ్రిని సమకూర్చడం మొదలుకొని ఇతర అన్ని పనులు వారే చేసేటట్లుగా కార్యాచరణను రూపొందించినట్లు తెలిసింది. ఈ నెల 22 నుంచి గ్రేటర్‌లో కేటీఆర్ రోడ్ షోలు ఉండేటట్లుగా ప్లాన్​ చేశారు. రోడ్ షోను కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ప్లాన్​ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తో సహా మంత్రులందరూ హాజరుకానున్నారు.

ప్రచారం షురూ

టీఆర్​ఎస్​ పార్టీ బల్దియా ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాకుండానే ప్రచారపర్వానికి మంత్రులు తెర తీశారు. అప్పగించిన డివిజన్లలో కార్యకర్తల సమావేశాలను కొందరు మంత్రులు గురువారం నిర్వహించారు. ఎలాగైనా గెలిచి తీరాలని పిలుపునిచ్చారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్​లు ప్రచారాన్ని ఆరంభించారు. టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ మీట్​ ద ప్రెస్​ కార్యక్రమంలో భాగంగా తను, తన పార్టీ ఉద్దేశ్యాలను, లక్ష్యాలను చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా గ్రేటర్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలంతా వారికి కేటాయించిన డివిజన్లలో మకాం వేశారు. ఐతే గ్రామీణ ప్రాంతాల నుంచి వారి కార్యకర్తలను, అనుచరగణాన్ని కూడా ఈ ప్రచారంలో వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. స్థానిక బలంతో పాటు గ్రామీణ ప్రాంత కార్యకర్తలు కూడా తోడుగా ఉండేటట్లుగా సమీకరించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి హోటళ్లు, లాడ్జీల్లో మకాం ఏర్పాటు చేసే బాధ్యతను అభ్యర్ధులపైనే వేసినట్లు చెబుతున్నారు.

నాకొద్దీ డివిజన్

టీఆర్ఎస్​ పార్టీ ఎన్నికల ప్రచారం, గెలుపు బాధ్యతలను మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అప్పగించింది. ఈ మేరకు బుధవారం జాబితాను విడుదల చేశారు. ఐతే గురువారం మళ్లీ కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. ఓడిపోయే డివిజన్లు మాకొద్దు అనే భావనతో కొందరు ఇన్ చార్జీలు ఉన్నట్లు తెలిసింది. అందుకే పక్కాగా గెలిచే డివిజన్లపై ఫోకస్ పెడితే రానున్న రోజుల్లో తాను ఇన్ చార్జీగా ఉండి విజయం సాధించినట్లు ట్రాక్ రికార్డు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్​ సిట్టింగు కార్పొరేటర్లపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ గెలుపు కష్టమేనన్న భావన వ్యక్తీకరించింనట్లు ప్రచారం. అందుకే తనకు ఆ డివిజన్ వద్దు అంటూ మార్పునకు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం.

అన్నింట్లో తాను..

ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అన్ని పార్టీ కమిటీల్లో తన పేరు ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. ప్రతి కమిటీలోనూ తాను ఉంటానంటూ అధిష్ఠానం దగ్గర మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ప్రతి పని తానే చేస్తానంటూ ఒత్తిడి చేస్తూ కమిటీల్లో పేరు సంపాదించుకున్నట్లు పార్టీ నాయకులు కొందరు మండిపడుతున్నారు. తమకూ బాధ్యతలు అప్పగించకుండా ప్రతి పనికీ ఆయనొక్కరే అన్నట్లుగా చెప్పుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే గ్రేటర్​ ఎన్నికల్లో ఎలాగైనా అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయిస్తానంటూ కార్యకర్తలను ఎమ్మెల్యే ఒకరు తన వెంట చాలా రోజులుగా తిప్పించుకున్నట్లు తెలిసింది. తీరా జాబితాలో అతడి పేరు లేకపోవడంతో సదరు ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed