ఆర్టీసీ నుంచి అశ్వత్థామరెడ్డి ఔట్..

by  |
ఆర్టీసీ నుంచి అశ్వత్థామరెడ్డి ఔట్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డిని సర్వీసు నుంచి తొలగిస్తూ సంస్థ యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో మరోసారి తన వాదనను వినిపించుకోడానికి అవకాశమే ఉండదని బుధవారం రాత్రి జారీ చేసిన నోటీసులో కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ స్పష్టం చేశారు. సంబంధిత విభాగాధిపతి నుంచి అనుమతి లేకుండానే దీర్ఘకాలిక సెలవుపెట్టి విధులకు గైర్హాజరయ్యారని, గతంలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిటీ పలుమార్లు విచారణకు పిలిచినా హాజరుకాలేదని, అనేకసార్లు ఇంటికి సంజాయిషీ నోటీసులను పంపినా తీసుకోడానికి నిరాకరించారని ఏడు పేజీల నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు ప్రతులను బస్ భవన్‌ కార్యాలయంతో పాటు అశ్వత్థామరెడ్డి పనిచేస్తున్న ఎంజీబీఎస్ (మహాత్మగాంధీ బస్ స్టేషన్) నోటీసు బోర్డులోనూ ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.

ఎంజీబీఎస్‌లో ఏడీసీగా పనిచేస్తున్న అశ్వత్థామరెడ్డి 2019 డిసెంబరు 6వ తేదీ నుంచి గతేడాది ఆగస్టు 25వ తేదీ వరకు కంటిన్యూగా సెలవులో ఉంటూ విధులకు గైర్హాజయ్యారని, ఫలితంగా సంస్థ ప్రత్యామ్నాయ సిబ్బందికి విధులు అప్పగించడంలో అనే ఇబ్బందులు ఎదుర్కొన్నదని, మరోవైపు ప్రయాణికులకు కూడా సంస్థ తరపున సేవలు అందడంలో సమస్యలకు కారణమయ్యారని కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. సంస్థ సిబ్బంది సర్వీసు రెగ్యులేషన్స్ ప్రకారం ఆయనను సర్వీసు నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని కారణాలూ ఉన్నాయని పేర్కొన్నారు.


Next Story

Most Viewed