కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్‌బీఐ

by  |
కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్‌బీఐ
X

ముంబయి: కీలక వడ్డీ రేట్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో రెపోరేటు 4శాతం, రివర్స్ రెపోరేటు 3.30శాతం కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెపోరేటు రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ నెలవారీ సమావేశం గురువారంతో ముగిసింది.

విధాన కమిటీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వర్చువల్ సమావేశం ద్వారా వెల్లడించారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికం, ఆ తర్వాత మరో ఆరు నెలలపాటు ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని ద్రవ్య విధాన కమిటీ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయానికి కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

గత నెలలో విదేశీ మారక ద్రవ్య నిలువలు 56.8 బిలియన్ డాలర్లకు పెరిగి 534.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఇంకా ప్రతికూల జోన్‌లోనే ఉన్నది’ అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.



Next Story

Most Viewed