బల్దియా పోరులో స్వతంత్రుల సవాల్

by  |
బల్దియా పోరులో స్వతంత్రుల సవాల్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: బల్దియా ఎన్నికల్లో రెబల్స్ గట్టిపోటీనిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు బేజారవుతున్నారు. ఆయా పార్టీల్లో ఎన్నో ఏండ్లుగా పని చేసి టికెట్లు ఆశించిన నాయకులు తమకు కేటాయించకపోవడంతో బరిలో దిగారు. వీరిని తప్పించేందుకు శతవిధాల ప్రయత్నించినా వారు వెనక్కి తగ్గలేదు. స్థానికంగా ఉన్న నాయకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న వారు కావడంతో వారిని ఆదరిస్తారనే ధీమాతో ప్రచారం చేస్తున్నారు. అంతేగాక టికెట్లు పొందిన అభ్యర్థులను ఓడిస్తామని సవాల్ విసురుతున్నారు.

బల్దియా ఎన్నికల్లో అభ్యర్థులకు స్వతంత్రులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ ఆశావహులు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. ఉపసంహరణ గడువుకు ముందు పోటీ నుంచి తప్పించేందుకు ఆయా పార్టీల నేతలు ప్రయత్నించినా విన్పించుకోలేదు. ఇన్నాళ్లు పార్టీ, మీ వృద్ది కోసం పనిచేయించుకుని తీరా టికెట్లు ఇవ్వకుండా ఇతరులకు ఇస్తారా..? అని, మీరు టికెట్ ఇచ్చిన పార్టీ అభ్యర్థిని ఓడించే తీరుతామని తేగేసి చెబుతున్నారు. దీంతో పార్టీ రెబల్స్ తో ప్రధాన పార్టీలకు కొత్త చిక్కొచ్చి పడింది. బుజ్జగించినా స్వతంత్రులు ససేమిరా అంటూ తాము ఓటమి చెందిన పర్వాలేదు కానీ.. పార్టీ టికెట్ పొందిన వారిని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ప్రధాన పార్టీలో గుబులు..

గ్రేటర్ ఎన్నికల్లో స్వతంత్రులుగా బరిలో దిగిన కొందరు అభ్యర్థులు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఈ బెడద ఏక్కువగా ఉంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి టికెట్ దక్కకపోవడంతో నేరుగా పోటీలోకి దిగి ఇతరులకు సవాల్ విసురుతున్నారు. వీరంతా గతంలో డివిజన్, పలు పాలక మండళ్లలో పదవులు నిర్వహించడంతో స్థానికంగా పలుకుబడి ఉంది. ఉపసంహరణ రోజున రెబల్స్ గా నామినేషన్ వేసినా కొంతమందిని బుజ్జగించి పోటీలో నుంచి తప్పించినా మరికొందరు మాత్రం మొండికేశారు. గెలుపు ఓటములను తేల్చుకుందామని బరిలో నిలిచి, పార్టీ అభ్యర్థులకు సవాల్ విసిరారు. నువ్వా.. నేనా.. అంటూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.

ప్రచారం చేయకుండా ఉండేలా..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి 150 డివిజన్లలో 1122మంది బరిలో ఉన్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. టీఆర్ఎస్ మాత్రమే 150 డివిజన్లలో పోటీ చేయగా, బీజేపీ నవాబ్ కుంటలో మినహా 149స్థానాల్లో బరిలో ఉంది. కాంగ్రెస్ 146 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో నిలిపింది. టీడీపీ 106 చోట్ల, మజ్లీస్ తరపున 51మంది పోటీ చేస్తున్నారు. అదేవిధంగా సీపీఐ నుంచి 17మంది, సీపీఎం నుంచి 12మంది తలపడుతున్నారు. వీరిలో వివిధ రిజిస్టర్డ్ పార్టీలకు చెందిన వారు 76మంది ఉండగా, స్వతంత్రులు 415మంది పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేసి బీ ఫాం సమర్పించని వారిని స్వతంత్రులుగా గుర్తించారు.

ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నుంచి పలు ప్రాంతాల్లో రెబల్స్ బరిలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరణకు చివరి వరకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రెబల్స్ గా ఉన్న వారు ప్రచారం చేయకుండా ఉండేలా మంత్రాంగం మొదలుపెట్టారు. ఆఫర్లు ప్రకటించి రెబల్స్ ను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిచోట్ల పార్టీ అభ్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్నారు. ముఖ్య నేతలు వీరిని బుజ్జగించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీ నుంచి పక్కకు తప్పుకుంటే రూ.20నుంచి రూ.50లక్షలపై చిలుకు ఇచ్చేందుకు బేరాలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. స్వతంత్రులు గట్టి పోటీ ఇచ్చినట్లయితే పార్టీ ఓట్లు చీలి అభ్యర్థి ఈ ఎన్నికల్లో ఓడిపోయే ప్రమాదం ఉందని డివిజన్ ఇన్ చార్జి బాధ్యతులు నిర్వహిస్తున్న ముఖ్య నేతలు హైరానా పడుతున్నారు.



Next Story

Most Viewed