ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ 13వ స్థానానికి.. కాంగ్రెస్ పాలనపై సంజయ్ విమర్శలు

by Ramesh Naini |

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణ.. కాంగ్రెస్ పాలనలో ఆ ప్రతిష్టను కోల్పోయిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ 13వ స్థానానికి.. కాంగ్రెస్ పాలనపై సంజయ్ విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణ.. కాంగ్రెస్ పాలనలో ఆ ప్రతిష్టను కోల్పోయిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఎన్నో సంవత్సరాలపాటు తొలి మూడు స్థానాల్లో కొనసాగిందని.. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం 13వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు. టీఎస్-ఐపాస్ విధానాన్ని నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందని, అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ సైతం అనుసరించిందన్నారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్‌ను టీజీగా పేరు మార్చడం తప్ప పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. టీజీ-ఐపాస్ కింద పరిశ్రమల అనుమతులు గణనీయంగా తగ్గి పోయాయన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం దెబ్బతినడంతో ప్రముఖ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గుచూపుతున్నాయని.. పారిశ్రామికవేత్తలు తెలంగాణకు రావడానికి వెనుకాడుతున్నారని అన్నారు. టీ-హబ్ నుంచి ప్రారంభమైన స్కైరూట్ సంస్థ రూ.10 వేల కోట్ల పెట్టుబడుల స్థాయికి చేరడం బీఆర్ఎస్ పారిశ్రామిక విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏడేళ్లకు పైగా కేంద్ర మంత్రిగా ఉన్నా హైదరాబాద్‌కు ఒక్క పెద్ద పరిశ్రమను కూడా తీసుకురాలేదని.. ఫార్మా విలేజ్‌కు అనుమతి తెచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. టీ-హబ్‌ను బలోపేతం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిర్లక్ష్యం చేసిందని.. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో పరిస్థితి కొంత మెరుగుపడిందని అన్నారు. ఐటీ శాఖ నిర్వహణలో శ్రీధర్‌బాబుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.

Next Story