నైట్ కర్ఫ్యూలో రికార్డింగ్ డ్యాన్సులు

by  |
నైట్ కర్ఫ్యూలో రికార్డింగ్ డ్యాన్సులు
X

దిశ హుజూర్‌నగర్ : కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దానిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలో భాగంగా రాత్రి 9 తొమ్మిది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కానీ హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలోని నక్కగూడెం, మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం, పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామాలలో ఈ కర్ఫ్యూ వర్తించదని తెలుస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా ఆ గ్రామాలలో డ్రామాలతోపాటు ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రికార్డింగ్ డ్యాన్స్ టీమ్ లను తీసుకువచ్చి రికార్డింగ్ డ్యాన్సులను శనివారం రాత్రి నిర్వహించారు. నిర్వాహకులు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ పోగ్రామ్ లు నిర్వహించినట్లు సమాచారం. వీటిని చూసేందుకు ఒక్కొక్క స్టేజి వద్దకు సుమారు 500 పైగానే స్థానిక ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు వచ్చినట్లు సమాచారం.

కర్ఫ్యూ సమయంలో కరోనా నిబంధనలు పాటించకుండా ఇలా రికార్డింగ్ డ్యాన్స్ లు, డ్రామాలు చేయడంతో వీటిని చూసేందుకు వెళ్ళిన వారిలో ఎంతమందికి కరోనా ఉందోనని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చూసేందుకు వెళ్లిన ప్రజలలో ఏ ఒక్కరికీ మాస్క్ లేకపోవడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. రాత్రి 9 దాటితే దుకాణాలతోపాటు రోడ్లపై తిరగొద్దని చెప్పే పోలీసులు ఉన్నతా ధికారులకు ఇక్కడ నిర్వహిస్తున్న డ్రామాలు, డ్యాన్స్ లు కనిపిచడం లేదా అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్లనే అధికారులు ఈ డ్రామా డ్యాన్స్ లు నిర్వహిస్తున్నారని తెలిసి పోలిసులు కూడా పట్టించుకోవడం లేదని సమాచారం . ఏది ఏమైనా ఈ రికార్డింగ్ డ్రామా డ్యాన్సులు పై అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా లేక ప్రజాప్రతినిధులు ఒత్తిడి వల్ల వదిలేస్తారో .. వేచిచూడాల్సివుంది.

Next Story

Most Viewed