పరిహారం రాలేదు.. చితి పేర్చుకొని వృద్ధుడు ఆత్మహత్య

by  |
పరిహారం రాలేదు.. చితి పేర్చుకొని వృద్ధుడు ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ఆది నుంచి వివాదాల మధ్యనే పనులు నడుస్తున్నాయి. మల్లన్నసాగర్‌లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు, రైతులు తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. అందులో మొదటి వరుసలో నిలిచేది వేములఘాట్ గ్రామమే. భూనిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ఏండ్ల తరబడి దీక్షా శిబిరం నడిపారు. వీరికి అనేక సంఘాలు మద్దతు తెలిపాయి. అయినా వారికి న్యాయం జరగలేదు. ఇప్పటికి చాలా మంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందక, వ్యవసాయ భూమి, ఇంటి డబ్బులు రాక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా గురువారం రాత్రి తొగుట మండలం వేములఘాట్ గ్రామానికి చెందిన వృద్ధుడు సైతం తనకు ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్లు రాలేదని తన స్వంత ఇంటి కట్టెలను కాడుగా మార్చుకొని కిరోసిన్‌తో అంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో వేముల ఘాట్ గ్రామంతో పాటు సిద్దిపేట జిల్లా అంత విషాదచాయలు అలుముకున్నాయి. ఏడు పదుల వయసులో తన చావు కోసం ఇంటి కట్టెలనే కాడుగా పేర్చుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికుల హృదయాలను కలచివేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ ఇంటికి న్యాయం చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మృతుని మనువడు తమకు అన్ని ప్యాకేజీలు వచ్చాయని, మా తాత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదంటూ మాట్లాడిన మాటలతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరికొందరు ఈ సంఘటనలో మృతుని మనువడి వెనుక ఏదో రాజకీయ శక్తి పనిచేస్తోందని, రాజకీయ ప్రలోభాలకు లొంగి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడనే అనుమానాన్ని సైతం పలువురు ప్రతిపక్ష నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

అన్ని ప్యాకేజీలు వచ్చాయి : మనువడు

మనువడు మాత్రం తమకు అన్ని ప్యాకేజీలు వచ్చాయి. ఇల్లు కూడా వచ్చింది. ఇంట్లో తాత, నేను ఉంటున్నామని చెబుతున్నాడు. మృతుని మనవడు తిరుపతి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితమే తాము ఇల్లు ఖాళీ చేసి పోయాం. కొద్ది రోజులుగా పిడిచెడ్ గ్రామంలో మా చిన్నమ్మ వద్ద ఉంటున్నాడు. నిన్న వేములఘాట్ గ్రామానికి చేరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్నేండ్లు ఉన్న ఇల్లు పోయిందన్న బాధ, చిన్నమ్మ దగ్గర ఏమైనా గొడవలు జరిగింది కావచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తాత మరణం, మనువడి మాటలకు పొంతన కుదరడం లేదని, ఈ సంఘటనలో అధికారుల ఒత్తిడి గానీ, రాజకీయ ఒత్తిడి గానీ ఏదైనా ఉండొచ్చని, అందుకే మనువడు తన తాతపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి తన కాడు తానే పేర్చుకొని మృతి చెందడం అందర్ని శోక సంద్రంలోని నెట్టేసింది. ఇక ఈ ఘటనపై జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story