ఇది ఒకింత ఆశ్చర్యమే.. గతంలో ఎప్పుడు ఇలా కాలేదు

by  |
ఇది ఒకింత ఆశ్చర్యమే.. గతంలో ఎప్పుడు ఇలా కాలేదు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : శ్రావణమాసాన్ని పవిత్రమాసంగా భావిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఇంట్లో, ఆలయాల్లో వ్రతాలు, పూజలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏడాదీ శ్రావణమాసంలో యాదాద్రి ఆలయం భక్తులతో కిటకిటలాడేది. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. శ్రావణ మాసం ప్రారంభమైనా భక్తుల సందడి కనిపించడం లేదు. కరోనా కారణంగా భక్తుల రద్దీ తగ్గిపోయిందని అర్చకులు, పూజారులు అంటున్నారు. పెళ్లిళ్ల హడావిడి సైతం ఈ మాసంలోనే మొదలుకానుంది. యాదాద్రి లక్ష్మీనారసింహుడి క్షేత్రం ప్రతి ఏడాదీ శ్రావణ మాసంలో కిటకిటలాడేది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో శ్రావణ మాసం తొలిరోజే యాదాద్రి క్షేత్రం బోసిపోయింది. మాములు రోజుల్లో వచ్చే భక్తుల రద్దీ సైతం కన్పించకపోవడంతో అధికారులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. కరోనా కారణంగా యాదాద్రి క్షేత్రానికి పూర్తిగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. శ్రావణ మాసంలో గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కనిపించలేదని అర్చకులు, పూజారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక పూజలే కాదు.. మాముల దర్శనాలకూ రావడం లేదు

శ్రావణమాసంలో ప్రతి ఏడాదీ యాదాద్రి క్షేత్రంలో విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ విజృంభణ కారణంగా భక్తులు లేక బాలాలయం వెలవెలబోతోంది. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, ఇతరత్రా విశేష కార్యక్రమాలు జరిపించుకునేందుకు భక్తులెవరూ రావడం లేదు. కనీసం సాధారణ దర్శనాలకు కోసం భక్తులు లేక క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అధిక శాతం మంది భక్తులు ఆలయాలకు వెళ్లకుండా ఇంటి వద్దే పూజలు నిర్వహిస్తున్నారు.

కరోనా భయంతోనే..

యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉంది. నిత్యం నగరానికి రాకపోకలు సాగించేవారి సంఖ్య అధికంగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండడం వల్ల ఆ ప్రభావం యాదాద్రిభువనగిరి జిల్లాపై పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో యాదాద్రి క్షేత్రం చుట్టూ ఉన్న జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదవుతుండటంతో భక్తులు యాదాద్రికి రావడానికి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed