కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బులు మాయం

by  |
money hidden
X

దిశ, కేసముద్రం: కూతురి పెళ్లిని ఘనంగా నిర్వహించాలని ఆ తండ్రి కలలు కన్నాడు. ఇందులో భాగంగానే పెళ్లి ఖర్చుల నిమిత్తం కొంత నగదును పోగు చేశాడు. పెళ్లి సమయం దగ్గర పడుతుండగా, ఇంతలో బీరువాలో దాచిన నగదు మాయమైంది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ గ్రామంలో చోటు చేసుకుంది. కేసముద్రం ఎస్ఐ రమేష్ బాబు వివరాల ప్రకారం.. బేరువాడ గ్రామానికి చెందిన కొండబోయిన వెంకన్న-రేణుక దంపతుల చిన్న కూతురు రమ్యకు పెళ్లి ఖరారైంది. కూతురి పెళ్లిని ఘనంగా నిర్వహించాలని తల్లిదండ్రులు కలలుగన్నారు. ఈ క్రమంలో ముందస్తుగానే కూలి నాలి చేసి ఓ చిట్టి కట్టి, రెండ్రోజుల క్రితం ఆ చిట్టిని ఎత్తుకున్నారు.

దీంతో వారికి రూ.2 లక్షలు వచ్చాయి. వాటిని అలాగే ఇంటికి తీసుకొచ్చి బీరువాలో దాచిపెట్టారు. ఈ క్రమంలో బుధవారం పట్టపగలు కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలోని రెండు లక్షలు కాజేశారని వాపోయారు. ఉదయం వారు పనికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా బీరువా తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని రెండు లక్షలు కనిపించకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ రమేష్ బాబు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed