ప్రచారం షురూ.. దూకుడు పెంచిన పార్టీలు

by  |
MLC election campaign
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారంలో దూకుడు పెంచారు. ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ఎవరి స్థాయిలో వారు ప్రచారం చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి వారి అనుచరులు, నాయకులతో ప్రచారం సాగిస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులు కూడా చాప కింద నీరులా ప్రచారాలు సాగిస్తూ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులకు దడ పుట్టిస్తున్నారు.

జోరుగా సమావేశాలు..

అధికార టీఆర్ఎస్ పార్టీ శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏకంగా 10 నియోజకవర్గాలలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాలలో జరిగిన సమావేశాలకు హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశ దిశా నిర్దేశం చేశారు. ఆదివారం నుంచి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వారి వారి పరిధిలో పర్యటించి ఓటర్లను ఒప్పించి మెప్పించేలా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునేలా వ్యూహాలు రూపొందించుకొని ముందుకు సాగేందుకు సన్నద్ధమవుతున్నారు.

వ్యూహాత్మంగా ప్రధాన పార్టీలు..

బీజేపీ అభ్యర్థి తరపున క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించకపోవడం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఒకటి రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం మినహాయిస్తే మిగతా ముఖ్యమైన నాయకులు ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జి.చిన్నారెడ్డి తరఫున గెలుపు బాధ్యతలను స్వీకరించిన ఎంపీ, పీసీసీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌ల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పని చేస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించి మరింత ఉత్సాహంగా ఆ పార్టీ శ్రేణులు ముందుకు సాగేందుకు సమాయత్తం అవుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న ఎల్ రమణకు మద్దతుగా బీసీ సంఘాలు మద్దతు పలికినా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ మేరకు ఫలిస్తాయో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

దూకుడుగా స్వతంత్రులు..

ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల పరిస్థితులు ఇలా ఉంటేఎన్నికల రంగంలో ఉన్నస్వతంత్ర అభ్యర్థులుప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రధాన పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా, వామపక్ష పార్టీల మద్దతుతో పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ తరపున ఇప్పటికే ఆయా సంఘాలు సమావేశాలు నిర్వహించి మద్దతు ప్రకటించాయి. దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో ఆయన పర్యటనలు పూర్తయ్యాయి. ప్రచార హోరు పెరిగిన తర్వాత తిరిగి ఉమ్మడి జిల్లాలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించేలా ఆయన మద్దతుదారులు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి విఫలమైన టి పీఆర్‌టీయూ అధ్యక్షుడు పీసీసీ మాజీ అధికారి ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అభ్యర్థుల అందరికన్నా ప్రచారంలో ముందున్నారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోపర్యటన పూర్తి చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు.

సోషల్ మీడియాలో హల్‌చల్

అభ్యర్థులు స్వయంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతుండగా ప్రచారం కోసం సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై పైసోషల్ మీడియాలోసెటైర్లు వేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం పై, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సోషల్ మీడియాలోప్రచారం అవుతున్న పోస్టులు నవ్వు తెప్పిస్తున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు తాము అధికార పార్టీపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలను పోస్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో వేచిచూడాల్సిందే.



Next Story

Most Viewed